జిల్లాలో చేపట్టిన సీఆర్పీలు
ఇంటింటికి తిరిగి వివరాలపై ఆరా
ఈ నెల 25 వరకు గడువు
మళ్లీ బడికి పంపేందుకు ప్రభుత్వం చర్యలు
గత ఏడాది272 మంది గుర్తింపు
భూపాలపల్లి రూరల్, జనవరి 14 :బడి బయటి, మధ్యలోనే చదువును మానేసిన పిల్లలను గుర్తించే ప్రక్రియ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంతోపాటు వారిని మళ్లీ బడికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. సర్కారు ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పిల్లలను గుర్తించే పనిలో ఉన్నారు. 39 మంది సీఆర్పీలు ఈనెల 7వ తేదీ నుంచి సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఆరు నుంచి 19 ఏండ్లలోపు పిల్లల వివరాలను ఆరా తీస్తున్నారు. సర్వేను ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయా ల్సి ఉంది. గత ఏడాది 272 మంది పిల్లలను గుర్తించగా, వారిలో పలువురిని తిరిగి బడిలో చేర్పించారు.
జిల్లాలో బడి బయటి, మధ్యలోనే చదును మానేసిన పిల్లలను గుర్తించే సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఆయా పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి సర్వే ప్రారంభించారు. జిల్లాలో 39 మంది సీఆర్పీలు సర్వే చేస్తున్నారు. ఏటా ఆరు నుంచి పద్నాలుగేళ్ల లోపు ఉన్న బడి బయటి పిల్లలను మాత్రమే గుర్తించేవారు. గత ఏడాది మేలో ప్రత్యేకంగా 15 నుంచి 19 ఏండ్లలోపు వయసు కలిగి, ఉన్నత విద్య ఆపేసిన వారిని సైతం గుర్తించారు. ఈసారి రెండు వేర్వేరుగా కాకుండా అందరినీ బడిబయటి పిల్లలుగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆరు నుంచి 19 ఏండ్లలోపున్న వారందరినీ గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
గత ఏడాది 272 మంది గుర్తింపు
జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 538 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 52వేల మంది విద్యార్థులు ఉన్నారు. కొందరు పలు కారణాలతో చదువుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గత ఏడాది బడి బయట ఉన్న వారిని గుర్తించారు. 14 ఏండ్లలోపు ఉన్న పిల్లలను 96 మందిని గుర్తించి తిరిగి పలు పాఠశాలల్లో చేర్పించారు. 19 ఏండ్లలోపు ఉన్న 176 మందిని గుర్తించగా, వారిలో 40 మంది సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ విద్య చదివేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఈ ఏడాది కూడా సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉన్నది.
పకడ్బందీగా..
బడి బయట, బడి మానేసిన పిల్లలను గుర్తించే సర్వేను జిల్లాలో పగడ్బందీగా చేస్తున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి గడువులోగా గుర్తించాలని ఆదేశించారు. సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. దీంతో సీఆర్పీలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలను ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
జిల్లాలో బడి బయటి పిల్లల సర్వే చేపట్టాం. సర్వేలో గుర్తించిన వారందరూ తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకుంటాం. ఈనెల 25లోపు సర్వే పూర్తి చేసి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వే పూర్తి చేస్తున్నాం.-మనోహర్ నాయక్, జిల్లా సమన్వయ అధికారి