సన్నద్ధమవుతున్న వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలు
క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు వారీగా నివేదిక తయారీకి ప్లాన్
15వ తేదీ తర్వాత సర్వే చేపడుతాం… డీఏవో ఉషాదయాళ్
290 ఎకరాల్లో పండ్ల తోటలకూ నష్టం కలిగినట్లు గుర్తింపు
తుడిచిపెట్టుకుపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
వరంగల్, జనవరి 14(నమస్తేతెలంగాణ) : వడగండ్ల వానతో జరిగిన పంట నష్టంపై సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఆయా గ్రామాల్లో రైతు వారీగా నష్టం వివరాలను అందులో పొందుపర్చాలని స్పష్టం చేసింది. దీంతో వర్షాలు బందవగానే సర్వే చేపట్టేందుకు వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నష్టంపై ప్రాథమిక అంచనా వేశారు. పది మండలాల్లోని 191 గ్రామాల్లో ప్రభావం కనపడిందని, 9,284 మంది రైతులకు చెందిన 10,811 ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో తెలిపారు. దీనిపై కలెక్టర్ గోపి అధికారులతో చర్చించగా, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట డివిజన్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో జిల్లాలో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు గ్రామాలను సందర్శించి పంట నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు. మక్కజొన్న, వేరుశనగ, జొన్న, మినుము, పెసర, ఆవు బఠానీ, ఆవాలు తదితర పంటలు దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. మొత్తం 10,811 ఎకరాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. ఉద్యానశాఖ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించి మిర్చి, కూరగాయల పంటలకు వాటిల్లిన నష్టంపై అంచనా రూపొందించారు. పది మండలాల్లో 11,451 మంది రైతులకు చెందిన 14,656 ఎకరాల్లో మిర్చి, 574 మంది రైతులకు చెందిన 619 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలపై కలెక్టర్ బీ గోపి వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఎక్కువగా నష్టం కలిగిన పంటల వివరాలను తెలుసుకున్నారు.
పండ్ల తోటలకూ నష్టం..
వడగండ్ల వానతో జిల్లాలో పండ్ల తోటలకూ నష్టం వాటిల్లింది. దీంతో ఉద్యానశాఖ అధికారులు మూడు రోజుల నుంచి గ్రామాలను సందర్శించి తోటలను పరిశీలించారు. నష్టంపై ప్రాథమిక అంచనాలు వేశారు. 213 మంది రైతులకు చెందిన 290 ఎకరాల్లో అరటి, మామిడి, పుచ్చ, పూల, మల్బరి తదితర తోటలకు న ష్టం జరిగినట్లు గుర్తించారు. నెక్కొండ, పర్వతగిరి, రా యపర్తి, దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోని ముడిగొండ, అప్పల్రావుపేట, చంద్రుగొండ, పర్వతగిరి, కొండూరు, దుగ్గొండి, చలపర్తి, లక్ష్మీపురం, కేశవపూర్, నాచినపల్లి, తొగర్రాయి, అడవిరంగాపురం, మందపల్లి, రేకంపల్లి, ముద్దునూరు, మైసంపల్లి, మహేశ్వరం, లక్నేపల్లి, ఇటుకాలపల్లి, ముత్తోజీపేట, రాజీపే ట, భానోజీపేట, మాదన్నపేట, లెంకాలపల్లి, రుద్రగూ డెం, రాగాపురం, గుండ్లపహాడ్ గ్రామాల్లో పండ్ల తోటలకు నష్టం కలిగినట్లు ప్రాథమిక నివేదికను తాజాగా ప్రభుత్వానికి పంపారు. అత్యధికంగా దుగ్గొండి మం డలం లక్ష్మీపురంలో 41 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో అరటి తోటకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో తెలిపారు. 290 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లితే, ఇందులో అరటి తోటల విస్తీర్ణం 137ఎకరాలు ఉండడం గమనార్హం. 45 ఎకరాలు పుచ్చ తోట ఉంది.
పెరుగనున్న విస్తీర్ణం..
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుక్రవారం వివిధ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. వడగండ్ల వానతో నష్టపోయిన మిర్చి, మక్కజొన్న, అరటి, వేరుశనగ తదితర పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించేందు కు కృషి చేస్తానని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. వడగండ్ల వానతో మిర్చి పంట పూర్తిగా నేలపాలై మో డులుగా మారిన చెట్లను చూపుతూ కంట తడిపెట్టిన రైతులను ఎమ్మెల్యే ఓదార్చారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్ దుగ్గొండి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. బాధిత రైతులతో కలిసి ఆమె వడగండ్ల వాన వల్ల నష్టపోయిన వివిధ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుతో పాటు ఈ శాఖ అధికారులు పలువురు గ్రామాలను సందర్శించి వడగండ్ల వానతో నష్టం కలిగిన మిర్చి, అరటి, పుచ్చ తోటలు, కూరగాయల పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారుల పర్యటన లు, ప్రజాప్రతినిధుల గ్రామాల సందర్శన, బాధితులు తమకు జరిగిన పంట నష్టాలను వివరిస్తున్నారు. దీం తో వడగండ్ల వానతో నష్టం వాటిల్లిన పంటల విస్తీర్ణం జిల్లాలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత జిల్లాలో పంట నష్టంపై సర్వే చేపడుతామని ఉషాదయాళ్ చెప్పారు. ఆయా మండలాల్లో తాసిల్దార్, మం డల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పంట నష్టంపై సమగ్ర సర్వేకు ప్రణాళిక తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. రైతు వారీగా వివరాలను సర్వేలో పేర్కొంటామని వెల్లడించారు.