సర్పంచుల అధ్యక్షతన పనులపై సమీక్షలు
హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు
చిట్యాల, జూలై 12 : గ్రామాల వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నాల్గో విడుత పల్లెప్రగతి పనుల గ్రామ సభలు సోమవారంతో ముగిశాయి. మండలంలోని చల్లగరిగెలో సర్పంచ్ కర్రె మంజుల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను గ్రామస్తుల ముందు వెల్లడించారు. చివరి రోజు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా పాలకవర్గం మొక్కలు నాటారు. చిట్యాల సర్పంచ్ పూర్ణ చందర్రావు ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో చేసిన పనులను వెల్లడించారు. అనంతరం పాలకవర్గ సిబ్బందిని శాలువాతో సన్మానించారు. నైన్పాక, జడల్పేట, ఒడితల, గోపాలపూర్, జూకల్ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. సభల్లో సర్పంచులు తొట్ల లక్ష్మి, రత్నాకర్రెడ్డి, సాంబలక్ష్మి, రజిత, మహేందర్ పాల్గొన్నారు.
పనులపై సమీక్ష
భూపాలపల్లి టౌన్ : పది రోజులుగా కొనసాగిన పల్లెప్రగతి పనులపై గ్రామాల్లో సర్పంచులు, అధికారులు సమీక్షలు చేస్తున్నారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించుకున్నారు. సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీల పాలకవర్గం సమావేశమై పల్లె ప్రగతి పనులపై చర్చించారు. గుర్తించిన పనులు, పెండింగ్ పనులను పూర్తి చేయించడంపై చర్చించారు. గొర్లవీడు గ్రామ పంచాయతీలో పల్లెప్రగతిలో కష్టించి పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బందిని సర్పంచ్ శంకర్, పాలకవర్గం సభ్యులు సన్మానించారు.
నిరంతరం కొనసాగాలి
పలిమెల : పల్లె ప్రగతిలో నిర్వహించిన పచ్చదనం, పరిశుభ్రత పనులు నిరంతరం కొనసాగాలని ఎంపీపీ కుర్సం బుచ్చక్క, సర్పంచ్ మడే చుక్కమ్మ అన్నారు. సోమవారం దమ్మూరులో పది రోజులుగా నిర్వహించిన పల్లె ప్రగతి పనులపై సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహిం చారు. గ్రామాభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తున్న పంచాయతీ సిబ్బందిని శాలువాతో సత్కరించి రూ.500 నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీపీ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు గ్రామంలో ప్రతి రోజూ జరిగేలా చూడాలాన్నారు. హరితహరంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మదన్, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గోన్నారు.
గ్రామస్తుల సమక్షంలో వివరాలు వెల్లడి
మొగుళ్లపల్లి : మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం ‘పల్లె ప్రగతి’కార్యక్రమంపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రత్యేక అధికారులు గుర్తించిన పనులు, పది రోజుల పాటు చేసిన పనులను గ్రామస్తులకు వివరించారు. మిగిలిన పనులను మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.