జయశంకర్ భూపాలపల్లి, జనవరి 12 (నమస్తే తెలంగాణ);కాలంకాని కాలంలో వడగండ్లు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చేతికొచ్చిన పంటలను ఊడ్చుకెళ్లి చేన్లను నామరూపాల్లేకుండా చేశాయి. మంగళవారం సాయంత్రం నుంచీ బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలో మిర్చి, మక్క, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిని రైతన్నకు కన్నీళ్లే మిగిల్చాయి. ప్రధానంగా నర్సంపేట డివిజన్లో తీవ్ర ప్రభావం చూపగా, ఇటుకాలపల్లి, నర్సింగాపూర్లో 17 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏటి చెక్డ్యామ్ వర్ష కాలం మాదిరిగా ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనగామలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, చాలాచోట్ల పెనుగాలుల ఉధృతికి రేకులు ఎగిరిపోవడంతో పాటు, పలు ఇండ్లు కూలిపోయాయి. భూపాలపల్లి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, బస్తాలు తడిసిపోయాయి. నల్లబెల్లిలో వరంగల్ కలెక్టర్ గోపి, ఖానాపురం, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పంటలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఉపరితల ద్రోణి కారణంగా కురిసిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. సోమవారం ఈదురుగాలులతో మొదలై మంగళవారం రాత్రి, బుధవారం వడగండ్లు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి జిల్లా అంతటా కుండపోత పోయగా, వరంగల్లో ప్రభావం ఎక్కువగా చూపింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో పాటు వడగండ్లు పడడంతో మక్క, మిర్చి పంటలు నేలవాలి, కాయలు రాలిపోయాయి. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో 26వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్ జిల్లాలో సగటున 5 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 4.1 సెం.మీ, జనగామలో 2.13 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు, మహబూబాబాద్ జిల్లాలో ఒక సెంటీ మీటరు చొప్పున కురిసింది. ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, వానల ప్రభావం అలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడవచ్చని.. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వరంగల్లోనే ఎక్కువగా..
వరంగల్ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. చెన్నారావుపేట మండలంలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు కురిసింది. నల్లబెల్లిలో 8.4 సెం.మీ, సంగెంలో 7.6 సెం.మీ, దుగ్గొండిలో 7 సెం.మీ, ఖిలా వరంగల్లో 6.5 సెం.మీ, ఖానాపూర్లో 5.9 సెం.మీ, వరంగల్ మండలంలో 5.4 సెం.మీ, నర్సంపేటలో 5.3 సెం.మీ వర్షపాతం కురిసింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో 7.6 సెం.మీ, ఐనవోలులో 6.8 సెం.మీ, ధర్మసాగర్లో 5.3 సెం.మీ.లు పడింది. కమలాపూర్, పరకాల, శాయంపేట, నడికూడ, హనుమకొండ, కాజీపేట మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో 5.4 సెం.మీ, జనగామలో 4.2 సెం.మీ, రఘునాథపల్లి, చిల్పూరు మండలాల్లో 3.3 సెంటీ మీటర్ల కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో 7 సెం.మీ, కొత్తగూడలో 5 సెం.మీ పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 3.6 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణంలో తేమ నిండి ఉంది. ఈదురుగాలులతో పూర్తిగా చల్లబడింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.