పార్కులు పల్లెలకు శోభాయమానాలు
ఉపాధి పనుల్లో కరోనా నిబంధనలు పాటించాలి
అదనపు కలెక్టర్ హరిసింగ్
నల్లబెల్లి, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని కొండాపూర్, గోవిందాపూర్, నాగరాజుపల్లెలో మంగళవారం ఆయన పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. అలాగే, మేడపల్లి గ్రామంలో యశోద దవాఖాన యాజమాన్యం ప్రభుత్వానికి రాసిచ్చిన భూమిలో సోషల్ వెల్ఫేర్ కళాశాల, పాఠశాల(బాలుర) ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రకృతి వనాలు గ్రామాలకు శోభాయమానాలుగా తయారైనట్లు తెలిపారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, విలేజ్ పార్కులతోపాటు గ్రామాల్లో చేపట్టిన పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో సేకరిస్తున్న తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి జీపీలు అదనపు ఆదాయం పొందాలన్నారు. ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపాధిహామీ కూలీలు కరోనా నిబంధనలు పాటిస్తూ పనులు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ విజేందర్, సర్పంచ్లు కరివేదుల వెంకట్రెడ్డి, గోనె శ్రీదేవి, గూబ తిరుపతమ్మ-రాజు, కార్యదర్శి రజిత ఉన్నారు.