జయశంకర్ భూపాలపల్లి/ములుగు, జనవరి 11 (నమస్తే తెలంగాణ);ఊరూవాడన జోరుగా సాగుతున్న రైతుబంధు సంబురాలతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల్లో హుషారు వచ్చింది. ప్రతిరోజూ రెట్టించిన ఉత్సాహంతో తీరొక్క రీతిన నిర్వహిస్తున్న వేడుకలతో ఎక్కడచూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. నాడు సరిపడా సాగునీరు లేక, కరంటు లేక, పంట కొనే దిక్కు లేక, కరువుతో అల్లాడిన తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతాంగం జైకొడుతున్నది. తొమ్మిదో రోజు మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, మేకల ప్రభబండ్లతో భారీ ర్యాలీలు తీసి ఖాతాల్లో రూ.50వేల కోట్లు జమచేసిన రైతుబాంధవుడికి కృతజ్ఞతాభిమానాలు తెలిపింది. ఈ సందర్భంగా పరకాల వ్యవసాయ మార్కెట్లో ముగ్గులతో తీర్చిదిద్దిన భారీ ‘కేసీఆర్ చిత్రం’ ఆకట్టుకోగా, మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రంగవల్లులు, ఆటపాటలతో సంబురం అంబరాన్నంటింది.
‘రైతుబంధు’ సంబురాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. పల్లె, పట్నం తేడా లేకుండా ర్యాలీలు, ఆటపాటలతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల్లో హుషారు కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్క రంగులతో వేసిన ‘రైతుబంధు’ ముగ్గులు.. డీజే పాటలకు అనుగుణంగా కోలాటాలతో ఆడబిడ్డలు చేసిన నృత్యాలు అలరించాయి. ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ స్వయంగా ముగ్గులేసి, కోలాటమాడుతూ వారిలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ‘రైతబంధు’ కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. అలాగే వ్యవసాయ మార్కెట్లో టార్పాలిన్పై ధాన్యంతో ‘అన్నదాత సుఖీభవ’ ‘జై కేసీఆర్’ అని రాసి అభిమానం చాటుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో రైతుబంధు సంబురాలు జోరుగా సాగాయి.
ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీలు ఆకట్టుకున్నాయి. ఇందులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వయంగా ఎడ్లబండి తోలుతూ వారిలో ఉత్సాహం నింపగా, పట్టణ పరిసరాలు సందడిగా మారాయి. అక్కడి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ముగ్గులతో తీర్చిదిద్దిన భారీ ‘కేసీఆర్ చిత్రం’ ఆకట్టుకున్నది. ఇక్కడ ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెంలో గొల్లపల్లి, తిమ్మాపురం గ్రామాల యాదవుల మేకల ప్రభబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ర్యాలీని ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలకేంద్రంలోని మిర్చి కల్లంలో సీఎం కేసీఆర్ అక్షరమాలతో అలంకరించగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జనగామ జిల్లా నర్మెటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీయగా రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.