వరంగల్ రీజియన్ నుంచి 122 సర్వీసులు
ప్రయాణికుల రద్దీకనుగుణంగా నడుపుతాం
ఆర్టీసీ ఆర్ఎం డీ విజయ్భాస్కర్
హనుమకొండ చౌరస్తా, జనవరి 8 :ఆర్టీసీకి సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు పట్నంవాసులు సిద్ధమవుతున్నారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 7 నుంచి 122 ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. దీంతో టీఎస్ ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. హనుమకొండ బస్స్టేషన్, వరంగల్ బస్స్టేషన్, ములుగు రోడ్డు, వరంగల్ అండర్బ్రిడ్జి, పబ్లిక్ గార్డెన్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్ -1, 2 హనుమకొండ, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ డిపోల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 122 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పుతున్నారు. శనివారం వరంగల్ రీజియన్ పరిధిలోని బస్స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హనుమకొండ బస్స్టేషన్ రద్దీగా మారింది. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సుల్లో తరలివెళ్తున్నారు.
14 వరకు అదనపు బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం నుంచి ప్రత్యేక సర్వీస్లను నడిపిస్తున్నాం. వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 122 అదనపు సర్వీసులను ప్రారంభించాం. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులను నడిపిస్తున్నాం. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను తిప్పుతున్నాం. కరోనా వైరస్ కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది.