హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలి
విద్యార్థులకు ప్రతి రోజూ రాగి లడ్డు, పల్లిపట్టీలు ఇవ్వాలి
కలెక్టర్లు అధికారులతో కలిసి హాస్టళ్లను తనిఖీ చేయాలి
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా
మానుకోట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల అధికారులతో సమీక్ష
మహబూబాబాద్, డిసెంబర్ 3 : అధికారులు సమన్వయంతో, బాధ్యతగా పనిచేసి ప్రగతి సాధించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా సూచించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో కలెక్టర్ శశాంకతో కలిసి సంక్షేమ హాస్టళ్లు, పోస్ట్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లపై ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ కోసం మహబూబాబాద్ జిల్లాకు కేటాయించిన రూ.కోటి నిధుల నుంచి రూ.94 లక్షలు ఖర్చులు చేశారని, మిగతా నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వసతి గృహాల్లో బయోమెట్రిక్ మిషన్లు పని చేయడంలేదని, వెంటనే మరమ్మతు చేయిం చి హాజరు నమోదు చేయాలన్నారు.
హాస్టల్ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి సొంత ఇంట్లో ఉంటున్నామనే భావన కలిగించాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో పిల్లలందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రతి హాస్టల్లో మెష్డోర్లు ఉండాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రతిరోజూ రాగిలడ్డు, పల్లిపట్టీలు ఇవ్వాలని సూచించారు. నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా పోస్ట్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లపై సమీక్షించారు. కలెక్టర్లు అధికారులతో కలిసి హాస్టళ్లను తనఖీ చేయాలన్నారు. కులాంతర వివాహాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, జాయింట్ డైరెక్టర్ హన్మంతు, ఉప సంచాలకుడు రమాదేవి, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, ఏఎస్డబ్ల్యూవోలు, హెచ్డబ్ల్యూవో పాల్గొన్నారు.
వసతి గృహాల సందర్శన
సమీక్ష అనంతరం రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర, బాలికల వసతి గృహాలను కలెక్టర్ శశాంకతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వసతి గృహాల మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. లోపలి గోడలపై దేశ, రాష్ట్ర చరిత్ర తెలిసేలా బొమ్మలు వేయాలన్నా రు. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.