వరంగల్ పీఏసీఎస్గా నామకరణం
పెగడపల్లి పీఏసీఎస్లోకి ఆరు గ్రామాలు
జిల్లాల మార్పుతో తెరపైకి ప్రతిపాదనలు
సహకారశాఖ కమిషనర్కు పంపిన అధికారులు
వరంగల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : హనుమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పేరు మారనుంది. త్వరలోనే వరంగల్ పీఏసీఎస్గా మారబోతున్నది. ఈ పీఏసీఎస్ పరిధిలోకి వచ్చే ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ఆరు గ్రామాలను పెగడపల్లి పీఏసీఎస్లో కలుపనున్నారు. ఈమేరకు సహకార శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల స్థానంలో గత ఆగస్టు నుంచి వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉనికిలోకి వచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ రూరల్ జిల్లాలో 32 పీఏసీఎస్లు ఉండేవి. గతంలో వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ మండలాలు హనుమకొండ జిల్లాలో కలవటం, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఖిలావరంగల్, వరంగల్ మండలాలు వరంగల్ జిల్లాలోకి రావటంతో పీఏసీ ఎస్ల సంఖ్య ఇప్పుడు 28కి తగ్గింది. వీటిలో ఒకటైన హనుమకొండ పీఏసీఎస్ వరంగల్ మండలం పైడిపల్లి కేంద్రంగా పనిచేస్తున్నది. ఈ పీఏసీఎస్ పరిధిలో మొత్తం 14 గ్రామాలు ఉండగా, వీటిలో ఎనిమిది వరంగల్, ఆరు హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్నా యి. పైడిపల్లి, ఆరెపల్లి, కొత్తపేట, దేశాయిపేట, ఎనుమాముల, మట్టెవాడ, గిర్మాజిపేట, రామన్నపేట గ్రామాలు వరంగల్ జిల్లా, హనుమకొండ, కుమార్పల్లి, లష్కర్సింగారం, పలివేల్పుల, గోపాలపురం, వడ్డెపల్లి గ్రామాలు హనుమకొండ జిల్లా పరిధిలోనివి. ఈ పీఏసీఎస్ పరిధిలో 2,473 మంది సభ్యులు ఉండ గా, వీరిలో 2,361 మంది వరంగల్ జిల్లా పరిధిలోని ఎనిమిది గ్రామాల్లో ఉన్నారు. మిగతా 112 మంది హనుమకొండ జిల్లాలోని ఆరు గ్రామాల్లో ఉన్నారు. లోనింగ్ ఎక్కువ మంది సభ్యులు ఉన్న వరంగల్ జిల్లా పరిధిలోని ఎనిమిది గ్రామాల్లోనే అధికంగా ఉంది.
మార్పునకు ప్రతిపాదనలు
హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్గా హరికృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈయనతోపాటు 13మంది డైరెక్టర్లు వరంగల్ జిల్లా పరిధిలోని గ్రామాలకు చెందిన వారే. పీఏసీఎస్ పైడిపల్లి కేంద్రంగా పనిచేస్తుండటం, అత్యధిక మంది సభ్యులతోపాటు పాలకవర్గంలోని డైరెక్టర్లందరూ వరంగల్ జిల్లా పరిధిలోని వారే కావటంతో మార్పు ప్రతిపాదన ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ పీఏసీఎస్ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని ఆరు గ్రామాలకు పెగడపల్లి పీఏసీఎస్ అనువుగా ఉంటుందని, పెగడపల్లి పీఏసీఎస్ బ్యాంకు, ఈ ఆరు గ్రామాల లోనింగ్ బ్యాంకు కూడా ఒక్కటేనని, ఆయా గ్రామాలకు పెగడపల్లి పీఏసీఎస్లో కలుపాలని కొందరు ప్రస్తావించారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం జరిగిన హనుమకొండ పీఏసీఎస్ పాలకవర్గ సమావేశం చర్చించి హనుమకొండ పీఏసీఎస్ పేరును వరంగల్ పీఏసీఎస్గా మార్చాలని, హనుమకొండ, కుమార్పల్లి, లష్కర్సింగారం, పలివేల్పుల, గోపాలపురం, వడ్డేపల్లి గ్రామాలను పెగడపల్లి పీఏసీఎస్లో కలపాలని కోరుతూ తీర్మాణించింది. దీంతో ఈ ఆరు గ్రామాల నుంచి హనుమకొండ పీఏసీఎస్లో సభ్యులు కూడా 112 మంది మాత్రమే ఉండటం, జిల్లాల మార్పు జరిగినందున పాలనపరమైన చిక్కులు రాకుండా అనువుగా ఉన్న పెగడపల్లి పీఏసీఎస్లో హనుమకొండ జిల్లాకు చెందిన ఆరు గ్రామాలను కలుపుతూ హనుమకొండ పీఏసీఎస్ పేరును వరంగల్ పీఏసీఎస్గా మార్పు కోసం సహకార శాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మార్పు ప్రతిపాదనలు రావటంతో సహకార శాఖ కమిషనరుకు పంపామని సహకార శాఖ జిల్లా అధికారి బీ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే త్వరలో హనుమకొండ పీఏసీఎస్ పేరు వరంగల్ పీఏసీఎస్గా మారటంతోపాటు దీని పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన ఆరు గ్రామాలు పెగడపల్లి పీఏసీఎస్లో కలువనున్నాయి. వరంగల్ జిల్లా పరిధిలోని ఎనిమిది గ్రామాలతో వరంగల్ పీఏసీఎస్ కొనసాగనుంది.