కరీమాబాద్, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండిచేయి చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం 43వ డివిజన్ మార్కండేయనగర్లో 6వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా అభివృద్ధికి అందరితో కలిసి పోరాడుతామన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, నగరంలో పేదలకు ఉపాధి కోసం భారీ పరిశ్రమను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల రవి, షేక్ బాషుమియా, గన్నారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఒరిగిందేమీ లేదు
నర్సంపేట : కేంద్ర బడ్జెట్లో రైతులకు ఒరిగిందేమీ లేదని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహా య కార్యదర్శి పెద్దారపు రమేశ్ అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన ఎంసీపీఐయూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.39.45లక్షల కోట్ల బడ్జెట్లో 10 శాతం కూడా రైతులకు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. రైతు వ్యతిరేక సాగుచట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రం, దొడ్డిదారిన కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా బడ్జెట్ రూపొందించిందని తెలిపారు. వ్యవసాయరంగ అభివృద్ధికి రూ.3లక్షల కోట్ల లోపే కేటాయించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా వ్యవసాయాన్ని ప్రోత్సహించి పేద, మధ్య తరగతి రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇన్ఫుట్స్, పరికరాలు, పెట్టుబడి రుణాలు అందించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యం, మద్దతు ధరలు వచ్చేలా రైతులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.