భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 23: విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, నూతన ఆవిష్కరణలను వెలికి తీసేందుకు కేంద్రం ఏటా వినూత్న కార్యక్రమం చేపడుతున్నది. విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సంయుక్తంగా ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పేరిట ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పేరున్న ఓ శాస్త్రవేత్త పేరిట ప్రతి సంవత్సరం ఈ పోటీలు ఉంటాయి. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమికల్ సైన్స్’గా పిలిచే ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ పేరిట నిర్వహిస్తున్నారు.
రూ.వంద ఫీజుతో..ఆన్లైన్లో..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్బోర్డు విద్యార్థులంతా ఈ పరీక్ష రాయవచ్చు. http:/// vvm.org.in వెబ్సైట్లో రూ.100రుసుం చెల్లించి అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది.
మూడు భాషల్లో పరీక్ష
హిందీ, ఇంగ్లిష్తో పాటు తెలుగు భాషలోనూ పరీక్ష రాసే అవకాశం ఉంది. మొదట పాఠశాల స్థాయిలో నమూనా పరీక్ష, తర్వాత జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో టెస్టులు ఉంటాయి. మొదట పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు అందిస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వారికి ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికను బహూకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. అంతేకాకుండా దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తారు.
పరీక్ష విధానం..
పరీక్ష రాసే విద్యార్థులు సామాన్య శాస్త్రంలో పట్టు సాధించాల్సి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం-20, ప్రకటించిన శాస్త్రవేత్త జీవిత చరిత్రకు సంబంధించి-20, లాజిక్, రీజనింగ్కు సంబంధించి 10 శాతం ప్రశ్నలుంటాయి. జిల్లా స్థాయిలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5వరకు విద్యార్థులు ఎంపిక చేసుకున్న తేదీల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో జనవరి 9, 16, 23 తేదీల్లో జాతీయ స్థాయిలో వచ్చే మే 14, 15 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి
కంప్యూటర్, సెల్ఫోన్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులంతా ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పరీక్ష రాయాలి. అన్ని పాఠశాలల విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించి జాతీయ స్థాయిలో సత్తా చాటేలా చూడాలి. త్వరలోనే మూడు భాషల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి.
-బీ.స్వామి, జిల్లా సైన్స్ అధికారి, జయశంకర్ భూపాలపల్లి