వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
నెక్కొండ, ఏప్రిల్ 27: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నా రు. మంగళవారం ఆయన నెక్కొండ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీసీపీ వెంకటలక్ష్మి,డీఎస్పీ (ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్) పుప్పాల తిరుమల్, ఎస్సై నాగరాజుతో కలిసి పీఎస్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఎక్కడా రాజీపడొద్దని, నేర నియంత్రణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్య లు చేపట్టాలన్నారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు స్టేషన్ ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలు పెంచాలని సూచించారు.
చెన్నారావుపేట పీఎస్ను సందర్శించిన సీపీ
చెన్నారావుపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ కే వెంకటలక్ష్మి, డీఎస్పీ తిరుమల్తో కలిసి మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సందర్శించారు. పీఎస్ పరిసరాలు, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన మొక్కల పెంపకం చేపట్టినందుకు ఎస్సై శీలం రవిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రిసెప్షన్ కౌంటర్, వివిధ విభాగాల్లో సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. సిబ్బంది పనితీరు మరింత మెరుగుపర్చేందుకు వర్టికల్స్ విధానంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే శాఖాపరమైన సమస్యలపై సిబ్బందితో చర్చించారు. .