భూపాలపల్లి, అక్టోబర్ 19:వనాలను పెంచి ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందేలా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న హరితహారం అద్భుత ఫలితాలు ఇస్తున్నది. రహదారులకిరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నాడు సమైక్య పాలనలో వెలవెలబోయి కనిపించిన గవర్నమెంట్ ఆఫీస్లు స్వరాష్ట్రంలో పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు, పోలీస్స్టేషన్ల ఆవరణలు హరితవనాలను తలపిస్తున్నాయి. –
సర్వ సాధారణంగా ఇతర ప్రాంతాల కన్నా కోల్బెల్ట్ ఏరియాలో వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నాడు సీమాంధ్రుల పాలనలో ఇక్కడ పచ్చదనం పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడేవారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పుణ్యమాని ఆ ఇబ్బందులు తప్పాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విరివిగా మొక్కలు నాటి, సంరక్షించడంతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు, పోలీస్ స్టేషన్ ఆవరణల్లో పచ్చదనం పెంపొంది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నాడు వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిలువ నీడ ఉండేది కాదు. సమీపంలోని హోటళ్లు, టీ కొట్లు, షాపుల వద్ద ఉక్కపోతతో, వేడిమి వాతావరణంలో గడిపేవారు. అదే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో పెంచిన మొక్కలు పెరిగి పెద్దవై చల్లటి నీడను, స్వచ్ఛమైన గాలి ఇస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే ప్రజలు ఆవరణలోని చెట్ల కిందనే సేద తీరుతున్నారు.
ఆహ్లాదకర వాతావరణంతో ప్రశాంతత
పచ్చని చెట్లతో పోలీస్స్టేషన్ ఆవరణ ఆహ్లాదాన్ని పంచుతున్నది. వివిధ సమస్యలతో ఇక్కడికి వచ్చే వారికి ప్రశాంతతను ఇస్తున్నది. మొక్కలు, చెట్లు, గార్డెనింగ్ సంరక్షణకు ప్రత్యేకంగా కానిస్టేబుల్ను నియమించాం. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, హరితనిధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
– వాసుదేవరావు, సీఐ, భూపాలపల్లి