దేవరుప్పుల, ఏప్రిల్ 30 : కరోనా కష్టకాలంలో కూలి పనులే ఉపాధినిస్తున్నాయని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించిన సీఈవో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బస్వ సావిత్రి, ఎంపీడీవో ఉమామహేశ్వర్తో కలిసి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఉపాధి పనులు నిలిపివేయాలని కొన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. వ్యవసాయ పనులు లేని వేసవిలో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పిం చేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామాల్లో వేర్వేరు చోట్ల ఉపాధి పనులు చేపట్టాలని, కూలీలు కరోనా నిబంధనలు పాటించేలా సిబ్బంది చూడాలన్నారు. ప్రతి కూలీకి రూ. 200 పైన కూలి లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నర్సరీలకు ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించాలని, ప్రతి రోజూ మొక్కలకు నీరు అందించాలన్నారు. అలాగే సీఈవో విజయలక్ష్మి ధరావత్ తండా, కామారెడ్డిగూడెం గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.