భూగర్భ జలాలను పెంపొందించాలి
ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
జనగామ చౌరస్తా, నవంబర్ 24 : సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సౌత్ రీజియన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలో భూగర్భ జల సమస్యలు, నిర్వహణపై జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, నీటిపారుదల, తాగునీరు, భూగర్భ జల శాఖల అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శివలింగయ్య మాట్లాడుతూ భూగర్భ జల వనరులను పెంచడానికి వాన నీటి సంరక్షణ ముఖ్యమని తెలిపారు. ఉపరితల జలం మన అవసరాలకు సరిపోవడం లేదని, భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపరితల రిజర్వాయర్ల కంటే భూగర్భ రిజర్వాయర్ల రీచార్జ్ వ్యయం తక్కువని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారం, జల్శక్తి అభియాన్ పథకం అమలు ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని కలెక్టర్ వివరించారు. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి సాగుకు ఆసక్తి చూపారని వివరించారు. ఏ పంటకు ఎంత నీరు అవసరమో అంతే వాడాలన్నారు. చెక్ డ్యామ్ల నిర్మాణం, చెరువుల మరమ్మతుల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జల వనరులను సంరక్షించి ప్రకృతిని కాపాడుకోవడానికి అందరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. జిల్లాలో బచ్చన్నపేట మండలంలో భూగర్భ జలాలు పెంచడానికి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని పనిచేసిన వారిని శివలింగయ్య అభినందించారు. అనంతరం భూగర్భ జలవృద్ధికి వాన నీటి సంచయన వ్యూహాలు అనే ప్రత్యేక బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హ మీద్, డీఆర్డీవో రాంరెడ్డి, ఆర్డీ జే సిద్దార్థ్ కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ జీ రవికుమార్, డాక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్ కార్లిన్ లూయిస్, డాక్టర్ మాధవ్, పీ యాదయ్య పాల్గొన్నారు.