చారిత్రక ఓరుగల్లు కోటను పర్యాటకంగా మరింత తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. వందల ఏళ్ల నాటి కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యమైన కీర్తితోరణాన్ని రాజముద్రలో చేర్చగా, కోటలో సుందరమైన శిల్పారామాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకు అనువైన స్థలం కోసం ఇటీవలే అధికారయంత్రాంగం సర్వే చేసి, డీపీఆర్లు కూడా సిద్ధం చేసింది. ఎటు చూసినా కళ్లను కట్టిపడేసే శిల్ప కళా సౌందర్యం, చుట్టూ పొదిగిన కోటలు, పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతున్న కోటకు, శిల్పారామం కూడా తోడైతే స్థానిక కళాకారులకు చేతినిండా ఉపాధి లభించనుండగా దేశ, విదేశాల పర్యాటకులకు పండుగే మరి..
ఖిలావరంగల్, సెప్టెంబర్ 25 : ఖిలావరంగల్ను ప్రపంచంలోనే అద్భుత ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కోటలో శిల్పారామం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండా ప్రకాశ్రావు, ఎమ్మెల్యే నరేందర్ ముందుకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా శిల్పారామం నిర్మించేందుకు అధికారులు రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఓ వైపు మ్యూజియం, మరోవైపు క్రీడామైదానం, ఆ పక్కనే శిల్పారామం నిర్మాణానికి కావాల్సిన అనువైన స్థలాన్ని అధికారులు గుర్తించారు. అలాగే రాతికోట అగడ్తలో రెండు కిలోమీటర్ల మేర బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, పెద్దలను ఆకర్షించే విధంగా డిజైన్లు రూపొందించారు. పర్యాటకులకు విభిన్న రుచులను పరిచయం చేసేందుకు ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. హైదరాబాద్లోని శిల్పారామాన్ని మించి ఖిలావరంగల్లో ఏర్పాటు చేయనుండగా, ఇందు కోసం సుమారు 12 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
కళాకారులకు జీవనోపాధి..
అంతరించిపోతున్న కళలను వెలికి తీసి కళాకారులకు జీవనోపాధి కలిగించేందుకు శిల్పారామం ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే భావితరాలకు కళలపై ఆసక్తిని కల్పించొచ్చు. ఇతర ప్రాంతాలకు చెందిన కళలను ఇక్కడ ప్రదర్శించడం, మన ప్రాంతంలోని కళలను ఇతర ప్రాంతాలకు పరిచయం చేయడం, చేతి వృత్తులు, హస్తకళలను ప్రోత్సాహించనున్నారు. శిల్పారామం లోపల, బయట చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించడం, మార్కెటింగ్ చేయడం వల్ల ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కవులు, కళాకారులకు గొప్ప వేదికగా శిల్పారామం నిలువనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా చారిత్రక ప్రాశస్త్యం..
ఓరుగల్లు కోటలో అడుగడుగనా చారిత్రక ప్రాశ స్త్యం ప్రతిధ్వనిస్తోంది. కీర్తితోరణాలు, త్రికూటాలయాలు, రాతి, మట్టి కోటలు, సింహ ద్వారాలు, ఏకశిలగుట్ట, చిల్డ్రన్స్ పార్కు, కోట పొరల్లో ఉన్న సైనిక స్థావరాలు, ప్రకృతి అందాలతో అలరారే కోటలో శిల్పారామం ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.