నర్సంపేట, ఆగస్టు 28 : ఆరు సంవత్సరాల బాలుడు అప్లాస్టిక్ ఎనిమియా(రక్తహీనత) లక్షణాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తల్లిదండ్రులు ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి రూ. 40 లక్షలు ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన వల్లాజీ మోహన్-పావని దంపతుల ద్వితీయ కుమారుడు అభిరాం(6) మృత్యువుతో పోరాడుతున్నాడు. గత అక్టోబర్ 21న ఈ చిన్నారికి పెద్ద జబ్బు వచ్చింది. అప్లాస్టిక్ ఏనిమియా (రక్తహీనత) లక్షణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు అప్పటి నుంచి దవాఖానలు తిరుగుతూ చికిత్స చేయిస్తున్నారు. ఉన్న ఆస్తులు విక్రయించి, ఆప్పులు చేసి ఇప్పటివరకు రూ.40 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఇంకా నయం కాలేదు. అయితే మరో సంవత్సరం పాటు మందులు, చికిత్స అవసరం ఉందని చెబుతున్నారు. ఇంకా రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చుల కోసం దాతలు చేయూతనిచ్చి, తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం చేసేవారు 9948635919 నంబర్లో సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.