నర్మెట, ఆగస్టు 28 : మండలంలోని వెల్దండలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన డైక్ (ఉపపాత శిల)ను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి గుర్తించి, శనివారం దాని వివరాలు తెలిపారు. గ్రామంలోని గుళ్ల చెరువు (మహ్మద్ సాగర్ చెరువు)పై పాత త్రికూటాలయం ఉన్నది. గుడి వెనుక నుంచి సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా గుట్టలపై డైక్ ఉంది.
డైక్ల ఏర్పాటు ఇలా..
శిలాద్రవంతో పెద్దపెద్ద గుట్టలు ఏర్పడిన సందర్భంలో బలహీనంగా ఉన్న రాతి సందుల్లోంచి ఇతర రకాల శిలాద్రవం ఉబికివచ్చి చల్లబడి మాగ్నటిక్ డైక్లుగా ఏర్పడుతాయి. ఒక శిల ఏర్పాటు సమయంలో రెండుగా విడిపోయి ఫలకాల మధ్య వేరేరకం శిలాద్రవం సమాంతరంగా ఉబికివచ్చి ఘనీభవించి ఏర్పడినవాటిని డైక్లు అంటారు. వెల్దండలోని ‘మాగ్నటిక్ డైక్’ 250-280కోట్ల ఏళ్ల నాటిదై ఉండవచ్చునని రత్నాకర్రెడ్డి తెలిపారు. బల్లపరుపులా ఉన్న గుట్టను డైక్ రెండు భాగాలుగా విడగొట్టింది. ముందుగా ఏర్పడిన రాతికన్నా డైక్లోని రంగు భిన్నంగా ఉండి ప్రత్యేకంగా కనిపిస్తుంది. వెల్దండ డైక్లో మెగ్నీషియం, నికేల్ లాంటి లోహాలున్నట్లు తెలుస్తున్నది. దక్కన్ పీఠభూమిలో ఇలాంటి డైక్లు చాలా చోట్ల ఉన్నాయని డైక్ శిలలను బ్లాక్ గ్రానైట్ అంటారని రత్నాకర్రెడ్డి వెల్లడించారు. డైక్ శిలలను నిర్మాణంలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఈ రకం శిలతోనే కాకతీయులు శిల్పాలు చెక్కారు.