హన్మకొండ, జూ లై 27 : రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపుతో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని పాలంపేటలో కాకతీయులు నిర్మించిన కట్టడానికి ప్రపంచ పటంలో చోటు దక్కడం, మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. రామప్ప ఆలయం యునె స్కో గుర్తింపు పొందడానికి ప్రభుత్వానికి సహాయ, సహకారాలందించిన కాకతీయ హరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాపారావు, ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తిని మంగళవారం హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్పకు యునె స్కో గుర్తింపు రావడం వెనుక 11 ఏండ్ల కృషి ఉంద న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2016లో నామినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిందని, సీఎం కేసీఆర్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో వ్యక్తి గతంగా మాట్లాడి, కాకతీయ కట్టడం ప్రాధాన్యతను వివరిస్తూ అధికారికంగా లేఖ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం 2019లో యునెస్కోకు నామినేషన్ అందజేసినట్లు మంత్రి తెలిపారు. యునెస్కో అడిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రత్యేకతను పలుమార్లు తెలుపుతూ ప్రొఫెసర్ పాండురంగారవు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి, చింతామణి గోపాల్ లాంటి నిపుణులతో నివేదికను పంపించిందన్నారు.
జూన్ 23న సహచర మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు, రాష్ట్ర స్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రిని, ఇతర అధికారులను కలిసి వారసత్వ గుర్తింపు కోసం కేంద్రం నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వహోదా గుర్తింపు రావడం తెలంగాణ వారందరికీ గర్వకారణమన్నారు. రామప్పకు ఈ కీర్తి లభించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని వివరించారు.
రామప్పాలయ ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు..
కాకతీయ హెరిటేజ్ సంస్థ, రామప్ప ఆలయ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిందని పాపారావు, ప్రొఫెసర్ పాండురంగారావు, సూర్యనారాయణమూర్తి తెలిపారు. రామప్ప ఆలయానికి గుర్తింపు ఒక మైలురాయి మాత్రమేనన్నారు. వచ్చే దశాబ్దంలో కాకతీయుల కట్టడాల అ భివృద్ధికి కృషి చేయాల్సినవసరం ఉందన్నారు.