నర్సింహులపేట, జూలై 27 : కరంటు ఇద్దరు రైతులను బలితీసుకుంది. వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మండలంలోని అజ్మీ ర తండా పంచాయతీ పరిధి వాంకుడోతు తండాలో పొలం నాటు వేసేందుకు ఉదయమే గొర్రు కొట్టడానికి వెళ్తున్న ఓ యువ రైతు విద్యుదాఘాతానికి బలయ్యాడు. గొర్రు ఎత్తుకుని వెళ్తున్న క్రమంలో కిందికి వేలాడే విద్యుత్ తీగలు దానికి తగలడంతో ఈ ఘటన జరిగింది. ఎస్సై ఎల్ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకుడోతు కిరణ్(22) పొలంలో నాటు కోసం మంగళవారం ఉదయం కూలీల కంటే ముందుగా గొర్రు తోలడానికి దాన్ని భుజంపై ఎత్తుకుని వెళుతున్నాడు. ఈ క్రమంలో దారిలో మోటర్లకు సరఫరా అయ్యే కరంటు వైర్లు(ఎల్టీ లైన్) తక్కువ ఎత్తులో ఉండడంతో గొర్రుకు తగిలాయి. దీంతో కిరణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ తీగలను సరి చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుసకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రైతులు ఆరోపించారు. మృతుడి తండ్రి అమర్సింగ్ ఫిర్యాదు మేరకు విద్యుత్ ఏఈ పాండు, లైన్మన్ వెంకన్న, హెల్పర్ ప్రశాంత్, భూమి యాజమాని భీమాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కిరణ్ మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు వివరించారు.
బంజర తండాలో మరో రైతు..
నెల్లికుదురు : పొలానికి నీళ్లు పారించే క్రమంలో మోటరు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బంజారా తండాకు చెందిన మాలోత్ వెంకన్న(45) తన పొలానికి నీళ్లు పారివ్వడానికి వెళ్లి విద్యుత్ మోటరును సరి చేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతడి భార్య మాలోత్ బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మానుకోట దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.