ఆత్మకూరు, జూలై 21 : సీసీ కెమెరాల సాయంతో దారి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఆత్మకూరు గ్రామానికి చెందిన వివాహిత డిగ్రీ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసేందుకు పరకాలకు వెళ్లడానికి మంగళవారం గూడెప్పాడ్ స్టేజీ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తుంది. గీసుగొండ మండలం ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గీసుగొండ రాకేశ్ అనే యువకుడు ఆమెను గమనించి, లిఫ్ట్ ఇస్తానని నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు.
కామారెడ్డి పల్లె గ్రామశివారులో కారు ఆపి ఇనుపరాడ్తో ఆమె తలపై కొట్టి మెడలోని పుస్తెలతాడు, చెవి కమ్మలు, కాళ్ల పట్టీలు, సెల్ఫోన్ లాక్కొన్నాడు. స్పృహ కోల్పోయిన మహిళను పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ముళ్లపొదల్లో పడేసి అక్కడ నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి తేరుకున్న మహిళ కేకలు వేయడంతో చుట్టపక్కల వాళ్లు వచ్చి ఆమె వివరాలు తెలుకొని 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఆమె భర్తకు సమాచారాన్ని అందించారు. భర్త ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ రంజిత్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాల సాయంతో నిందితుడు రాకేశ్ను గుర్తించారు. కారులో హైదరాబాద్కు వెళ్తుండగా స్టేషన్ఘన్పూర్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బంగారు ఆభరణాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్న సీఐ రంజిత్కుమార్, ఎస్సై రాజబాబు, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, ఘన్పూర్ కానిస్టేబుల్ రాజ్కుమార్, శ్రీనివాస్ను సీపీ తరుణ్జోషి, డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు. ఈ సమావేశంలో పరకాల ఏసీపీ శ్రీనివాస్, ఆత్మకూరు, శాయంపేట సీఐలు రంజిత్కుమార్, రమేశ్, ఎస్సైలు రాజబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.