నర్సంపేట/రాయపర్తి/పరకాల/నల్లబెల్లి/సంగెం/ఆత్మకూరు/శాయంపేట/నడికూడ/దామెర/ఖానాపురం/గీసుగొండ, జూలై 21: బక్రీద్ వేడుకలను జిల్లాలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. నర్సంపేటలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు కుటుంబాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నాయి. రాయపర్తి మండలవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. బక్రీద్ పర్వదిన వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి మాంసాహార వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసుకుని మరణించిన తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఫాతేహాలు ఇచ్చి ఇంటిల్లిపాది సామూహిక భోజనాలు చేశారు. బుధవారం ఉదయం ఫజర్ నమాజ్ల తర్వాత స్థానికంగా ఉన్న మసీదుల్లో కరోనా నిబంధనలకనుగుణంగా ఇమామ్ల సారథ్యంలో ప్రత్యేక నమాజ్ చేసి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో విలసిల్లేలా దీవించాలని అల్లాకు దువా చేశారు. అనంతరం ఖబ్రస్థాన్లకు చేరుకుని పూర్వీకుల సమాధులపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాయపర్తి, కొత్తరాయపర్తి, మహబూబ్నగర్, కొత్తూరు, బంధన్పల్లి, పెర్కవేడు, కొండాపురం, ఊకల్, మైలారం, జగన్నాథపల్లి, వెంకటేశ్వరపల్లి, కాట్రపల్లి, ఆర్అండ్ఆర్ కాలనీ, కొండూరు, తిర్మలాయపల్లి, గన్నారంలోని ముస్లింలు ఈద్-ఉల్-ఆదా వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పరకాల పట్టణంలోని పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగం, దానగుణం, సోదరభావం, శాంతిసామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను నల్లబెల్లి మండలంలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలకేంద్రంలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆత్మకూరు మండలంలోని హౌసుబుజుర్గు, కటాక్షపురం, అక్కంపేట, ఆత్మకూరు, నీరుకుళ్ల, పెంచికలపేట, పెద్దాపురం, గూడెప్పాడ్లో ముస్లిం బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సంగెంలోని మసీదులోపాటు గవిచర్ల, పల్లార్గూడలో ముస్లింలు నమాజ్ చేసి ఒకరికొకరు అలయ్ బలయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ మాట్లాడుతూ మండలంలోని నల్లబెల్లి, గవిచర్ల, పల్లార్గూడ, నార్లవాయి గ్రామాల్లో కబ్రస్థాన్లకు నిధులు మంజూరు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శాయంపేట మండలవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. నడికూడ మండలంలోని ముస్లింలు కొవిడ్ నిబంధనలతో బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు.
ముస్త్యాలపల్లిలోని దర్గా మసీదులో ప్రార్థనలు చేశారు. దామెర మండలంలోని ఊరుగొండ, కొగిల్వాయి, ల్యాదెళ్లలో జరిగిన వేడుకల్లో వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అక్తర్, అన్వర్ పాషా పాల్గొన్నారు. ఖానాపురంలోని మసీదులో కరోనా నిబంధనలు పాటిస్తూ ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేశారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్లోని 15, 16వ డివిజన్లో బక్రీద్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు మహ్మద్ ప్రవక్త బోధనలను వివరించారు.