పాలకుర్తి రూరల్, జూలై 21 : ‘పల్లె ప్రగతి’తో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు అభివృద్ధి బాటలో పయనిస్తోంది. గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జీపీ పాలకవర్గం వంద శాతం అమలుచేసింది. దాతల సహకారం, ప్రజల భాగస్వామ్యం తోడవడంతో ప్రగతి జోరందుకుంది. ప్రభుత్వం నెలనెలా విడుదల చేసిన సుమారు రూ.2కోట్లతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. రూ.12 లక్షల 50వేలతో వైకుంఠధామం, రూ.5లక్షలతో పల్లె ప్రకృతి వనం పనులను పూర్తి చేశారు. అలాగే రూ.6లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్ కొనుగోలు చేశారు. రూ.19 లక్షలతో గ్రామ పంచాయతీ కొత్త భవనం నిర్మించారు. దాతల సహకారంతో రూ.7లక్షలతో ట్రస్టు ఏర్పాటుచేసి స్వర్గరథాన్ని సమకూర్చారు. గ్రామాభివృద్ధి కోసం గందె సోమయ్య రూ.30లక్షల విలువ చేసే ఒకటిన్నర ఎకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందులో సకల సదుపాయాలతో వైకుంఠధామం నిర్మించారు. ఇందులో శివుడు, హరిశ్చంద్రుడి విగ్రహాలు ఆకట్టుకునేలా ఉండగా జీవిత పరిణామ క్రమాన్ని తెలిపే చిత్రాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. అంతే కాకుండా గ్రామాభివృద్ధిలో భాగంగా దాతలు పాఠశాలకు, గ్రామ పంచాయతీకి సుమారు రూ.10లక్షల ఫర్నిచర్ అందజేశారు. మినరల్ వాటర్ప్లాంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో పల్లె రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామ అభివృద్ధి కోసం ముందుకొచ్చి విరాళాలిచ్చిన దాతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందించి, ఘనంగా సన్మానించారు. అంతేగాక రైతు వేదిక, డబుల్ బెడ్రూం ఇళ్లు, సీసీ రోడ్లతో గ్రామం కళకళలాడుతోంది. ఇటీవల కలెక్టర్ కుడుముల నిఖిల గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రగతి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీ, వైకుంఠధా మాలను సందర్శించి పనుల నిర్వహణపై ప్రజాప్రతినిధు లను, అధికారులను అభినందించారు.
అందరి సహకారంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా. సుందరంగా వైకుంఠధామాన్ని పల్లె ప్రకృతి వనం నిర్మించాం. గత సర్పంచ్ గ్రామ పంచాయతీ భవనాన్ని నూతనంగా నిర్మించాడు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి దారి చూపిస్తే దాతలు అభివృద్ధి చేసి చూపించారు. మరో రెండేళ్లతో ప్రభుత్వ నిధులు దాతల సహకారంతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా. కలెక్టర్ ఇటీవల గ్రామాన్ని సందర్శించి అభినందించడం సంతోషంగా ఉంది.
ఊరి బాగు కోసమే భూదానం..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తితోనే ఎకరమున్నర భూ మిని దానం చేశా. ఆ స్థలంలో వైకుంఠధామాన్ని అద్భుతంగా నిర్మించారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు సంతృప్తిగా ఉంది. ఊరి బాగు కోసం ఇంకా దాతలు ముందుకురావాలి. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం చూస్తుంటే ముచ్చటేస్తోంది.