వరంగల్, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు వాన కురిసింది. మంగళవారం రాత్రి మొదలైన ముసురు బుధవారం ఉదయం వరకూ కురుస్తూనే ఉంది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 10.90 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. ములుగు జిల్లాలో 53.50, వరంగల్ రూరల్ జిల్లాలో 22.30, మహబూబాబాద్ జిల్లాలో 18.40 మిల్లీ మీటర్లు, జనగామ జిల్లాలో 21.1 మిల్లీ మీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి మండలంలో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహాముత్తారంలో 75.90 మిల్లీ మీటర్లు, వెంకటాపురం మండలంలో 74.30 మిల్లీ మీటర్లు, గణపురం మండలంలో 64.6 మిల్లీ మీటర్లు, వాజేడు మండలంలో 62 మిల్లీ మీటర్లు, పలిమెల మండలంలో 61.50 మిల్లీ మీటర్లు, ఏటూరునాగారం మండలంలో 57.90 మిల్లీ మీటర్లు, మహదేవపూర్ మండలంలో 57.3, శాయంపేట మండలంలో 40.50 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది.
పొంగుతున్న వాగులు, వంకలు..
రెండు రోజులుగా కురుస్తున్న వానలతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు మత్తడి పోస్తోంది. గార్ల మండలంలోని పాఖాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో మహాముత్తారం వాగు పొంగిపోర్లుతుండడంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ములుగు జిల్లా రామప్ప చెరువు నీటిమట్టం 36 అడుగులకు గాను 30 అడుగులకు చేరింది. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. అలాగే వాజేడు మండలంలోని బొగత జలపాతానికి భారీగా వరద వస్తుండడంతో సందర్శకులు వర్షంలో గొడుగులు పట్టుకొని మరీ జలపాతం అందాలను వీక్షించారు.