వరంగల్రూరల్, జూలై 20 (నమస్తేతెలంగాణ): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి బాధితులకు సత్వరమే నష్టపరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ ఎం హరిత తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు బాగా కృషి చేస్తున్నారన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, సమస్యలపై ఆమె పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెండింగ్లో లేకుండా బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు, రెవెన్యూ అధికారులు కృషి చేస్తుండడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
బాధితులకు పేమెంట్ విషయంలో ఆలస్యం జరుగకుండా ప్రభుత్వం గ్రీన్చానల్ ఏర్పాటు చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తున్నట్లు వివరించారు. బాధితులు కచ్చితమైన బ్యాంకు అకౌంట్ వివరాలు అందజేయాలన్నారు. ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, ఇన్చార్జి డీఎస్సీడీవో నిర్మల, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, మామునూరు ఏసీపీలు ఫణిందర్, శ్రీనివాస్, జీ రమేశ్, నరేశ్, జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుర్తి విజయ్కుమార్, మహంకాళీ యాదగిరి, సీహెచ్ సోమయ్య, బిర్రు మహదేవ్, భూక్యా హుస్సేన్, కళ్లెపు శోభారాణి, వాసం సాంబయ్య పాల్గొన్నారు.
హైవేలకు ఇరువైపులా మొక్కలు నాటాలి
చెన్నారావుపేట: జిల్లాలోని నేషనల్ హైవేలకు ఇరువైపులా మొక్కలు నాటాలని కలెక్టర్ ఎం హరిత అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడెప్పాడ్ క్రాస్రోడ్డు నుంచి నీరుకుళ్ల (పెంచికలపేట) వరకు మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ డీఈ కృష్ణారెడ్డిని ఆదేశించారు. అలాగే, ఆత్మకూరు సర్కిల్లో పూల మొక్కలు నాటేలా ఎంపీడీవో, జీపీ సిబ్బందికి మార్గదర్శకాలు ఇవ్వాలని డీఆర్డీవో సంపత్రావును కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ హైవేస్ జేఈ సుమత్, మదన్, సిబ్బంది పాల్గొన్నారు.