వరంగల్ చౌరస్తా, జూలై 20 : కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత చాలా మందిని బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం దవాఖానలో బ్లాక్ ఫంగస్ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. ఈ మేరకు ఎంజీఎం దవాఖానలో ఆధునిక యంత్ర పరికరాలతో కూడిన రెండు ఆపరేషన్ థియేటర్లు, 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. కొవిడ్ బారినపడిన వారితో పాటు బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మికొసిస్) బారినపడిన వారికీ ఎంజీఎంలో వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో రెండు నాజిల్ ఎండోస్కోపీ యంత్రాలను ఏర్పాటు చేసి, శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
అవసరమైన వారికి శస్త్రచికిత్సలు
కరోనా బారిన పడి కోలుకున్న వారిలో మాత్రమే బ్లాక్ఫంగస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న 45 రోజులు నుంచి 90 రోజుల మధ్య కాలంలో దీనిని గుర్తిస్తున్నారు. బ్లాక్ ఫంగస్గా నిర్ధారించిన తర్వాత అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ఫంగస్ వచ్చిన వారిలో సుమారు 85 శాతం మంది బాధితులకు డయాబెటిస్(మధుమేహం) ఉన్నట్లు గుర్తించారు. సుమారు 50 శాతం మందికి శస్త్రచికిత్స అవసరం ఉంటుందని, మిగిలిన వారు శస్త్రచికిత్స అవసరం లేకుండానే కోలుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణ వైద్య విధానంలో ముందుగా యాంటిఫంగల్ ఇన్ఫెక్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా సుమారు పది రోజుల పాటు రూ.ఐదు వేల విలువైన ఆంఫోటెడిసిన్ బీ ఇంజక్షన్లను వినియోగిస్తున్నారు. తర్వాత నెల రోజుల కోసం సుమారు రూ.32వేల విలువైన కొసకొనడోల్ మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఇలా ఒక్కో బాధితుడికి సుమారు రూ.80 వేల విలువైన వైద్యాన్ని అందిస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం
కరోనా వైద్యసేవలతో సమానంగా బ్లాక్ఫంగస్ బాధితులకు సైతం చికిత్స అందిస్తున్నాం. ఇందుకు ప్రభుత్వం సుమారు రూ.30 లక్షలతో రెండు నాజిల్ ఎండోస్కోపీ యంత్రాలను సైతం అందించింది. వాటి ద్వారా మెరుగైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గాంధీ దవాఖాన తర్వాత ఎంజీఎంలోనే శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 117 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యసేవలు అందించాం. వారిలో 54 మందికి ఆపరేషన్లు చేశాం. ఇప్పటి వరకు 87 మంది కోలుకున్నారు. ఖరీదైన మందులు కాబట్టి, ఎలాంటి తప్పులు జరుగకుండా నేరుగా బాధితులకే వాటిని అందిస్తున్నాం.