ఖిలావరంగల్, జూలై 20 : తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను వీక్షించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) భారత్ దర్శన్ యాత్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వరంగల్ రైల్వేస్టేషన్లో ఐఆర్సీటీసీ డిప్యూ టీ జనరల్ మేనేజర్ డీ కిశోర్ మంగళవారం వెల్లడించారు. వచ్చే నెల 27న మాతా వైష్ణోదేవి దర్శనం ఉత్తర భారత యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. రేణిగుంటలో బయలుదేరే ఈ రైలు సాయంత్రం కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు. ఉత్తర భారత దేశంలోని ఆగ్రా, మధుర, ఢిల్లీ, హరిద్వార్, అమృత్సర్, వైష్ణోదేవి క్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ రైలుకు తెలంగాణలో నల్లగొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉందన్నారు.
పది రాత్రులు, పదకొండు రోజులతో కూడిన ఈ యాత్రకు టికెట్ ధర స్లీపర్ క్లాస్ రూ.10,400, ఏసీ త్రీటైర్ రూ.17,330గా నిర్ణయించినట్లు తెలిపారు. రోజు ఉదయం టీ, కాఫీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజ న సదుపాయం కల్పించినట్లు చెప్పారు. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు నాన్ ఏసీ వాహనాలను అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనీయ స్థలాల్లో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 040-27702407, 97013 60701, 82879 32228/9 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అలాగే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ నుంచి మహాలయ పిండదాన్ తర్పన్ పేరుతో ప్రత్యేక రైలు ప్రారంభమవుతుందన్నారు.
ఆరు రాత్రులు ఏడు రోజుల పాటు సాగే ఈ యాత్ర టికెట్ ధర స్లీపర్ క్లాస్ రూ.6,620, త్రీ ఏసీ రూ.11,030గా నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 19న దక్షిణ్ భారత్ యాత్ర రైలు ప్రారంభమవుతుందన్నారు. దీని ద్వారా ఆరు రాత్రులు ఏడు రోజుల పాటు తిరుచిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, మహాబలిపురం, కంచిపురం దర్శనం ఉంటుందన్నారు. స్లీపర్ క్లాస్ ధర రూ.6620, త్రీఏసీ రూ.11,030గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఐఆర్సీటీసీ ప్రతినిధి పవన్కుమార్ పాల్గొన్నారు.