కరీమాబాద్, జూలై 20 : వనాలు క్షీణించడంతో వానరాలు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తూ నానా హంగామా చేస్తున్నాయి. ఒక్కోసారి దాడికి కూడా తెగబడుతున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలా కోతులు ఇళ్లలోకి చేరి ఇబ్బంది పెట్టకుండా శివారు ప్రాంతాల్లో మంకీ ఫుడ్కోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారంలో భాగంగా విరివిగా పూలు, పండ్ల మొక్కలు పెంచి అడవిని తయారుచేయిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ రంగశాయిపేటలో గతేడాది మంకీ ఫుడ్కోర్టు ఏర్పాటుచేయగా ప్రస్తుతం పచ్చదనం పెరుగడంతోపాటు బత్తాయి, దానిమ్మ, తదితర పండ్లు కూడా కాస్తున్నాయి.
హరితహారంలో భాగంగా గతేడాది జూన్ 25న రంగశాయిపేటలో మంకీ ఫుడ్ కోర్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి మొక్కల పెంపకం, పర్యవేక్షణపై వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. సుమారు ఎకరం స్థలంలో అరటి, దానిమ్మ, బత్తాయి, మామిడి, జామ వంటి పండ్ల మొక్కలను 1600 వరకు నాటారు. పశుపక్ష్యాదుల ఆహారం కోసం వివిధ రకాల పండ్ల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బోరు వేసి 16 చోట్ల నల్లాలను బిగించారు. నాటిన ప్రతి మొక్క చెట్టుగా ఎదిగేలా వాటికి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నారు. దీంతో పాటు వాటి ఎదుగుదలను పర్యవేక్షించేందుకు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
రంగశాయిపేటలోని మంకీ ఫుడ్కోర్టు పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సుమారు ఎకరం స్థలంలో పూలు, పండ్లు మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం. మా డివిజన్లో ఏర్పాటుచేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటికే చెట్లకు పండ్లు కాస్తున్నాయి. పూలు కూడా పూస్తున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది.
– మరుపల్ల రవి, కార్పొరేటర్