ఆత్మకూరు, జూలై 20: ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనులను వేగవంతం చేయాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. కొత్తగట్టు గ్రామ శివారులోని 8.20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్కు పనులను మంగళవారం డీఆర్డీవో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి సర్పంచ్ బోళ్ల నరేశ్, కార్యదర్శి కల్యాణిని అభినందించారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాల్లో ఇప్పటికే బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కోసం 10 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా మండలాల్లో పనులు సైతం కొనసాగుతున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ పరిధిలో మెగా పార్కు నిర్మాణాలకు నిధులు లేకపోతే అదనపు కలెక్టర్, కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు. జిల్లా అధికారులు పార్కు పనుల కోసం నిధులు కేటాయించారన్నారు. పనులను ముమ్మరం చేసేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. మెగా పార్కులో రకరకాల మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. పార్కు స్థలంలో ఇప్పటికే ఉన్న చెట్లను తొలగించకుండా కాపాడుకోవాలన్నారు. పార్కు చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్మద, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, ఏపీవో రాజిరెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ సురేశ్, టీఆర్ఎస్ నాయకులు మార్క రజనీకర్, రాజేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.