పల్లె ప్రగతితో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్కు మహర్దశ పట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కేరాఫ్గా నిలిచింది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదిక భవనం అందుబాటులోకి వచ్చి గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
నర్మెట, జూలై 13: కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగంగా మచ్చుపహాడ్ మూడు జీపీలుగా విడిపోయింది. 456 ఇండ్లు, 1654మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో పల్లె ప్రగతి ఊహించని మార్పును తెచ్చింది. సర్పంచ్ రామిని శివరాజ్, పంచాయతీ కార్యదర్శి నర్సింహ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు సమష్టిగా ఊరిని అభివృద్ధి పథాన తీసుకెళ్తున్నారు. పల్లె ప్రగతిలో మెరుగైన పనితీరుతో అధికారుల ప్రశంసలందుకున్నారు. రూ.4.60 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.11.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. పంచాయతీ కోసం రూ.6 లక్షలతో ట్రాక్టర్, రూ.1.70 లక్షలతో వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. పల్లె ప్రకృతి వనంలో 500 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రూ.22 లక్షలతో రైతువేదికను సిద్ధం చేసుకున్నారు. రెండు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులతో తాగునీటి ఇబ్బందులను దూరం చేసుకున్నారు. తడి, పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.2 లక్షలు అందిస్తుండడంతో పారిశుధ్యం, అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవతో బొమ్మకూర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు విడుదల కావడంతో గ్రామానికి సాగు, తాగునీటి కొరత తీరింది.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని సుందరంగా తయారు చేసుకున్నం. పల్లె ప్రగతి పనులు నా హయాంలో చేయడం ఆనందంగా ఉంది.
గోదావరి నీళ్లొస్తాయనుకోలేదు
గతంలో సాగునీరు లేక ఏటా పం టలు ఎండిపోయేవి. అలాంటి మా ఊరికి గోదావరి జలాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్కు మా ఊరోళ్లమంతా రుణపడి ఉంటం. గోదావరి జలాలతో భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి.
ప్రణాళికతో నిధుల వినియోగం
ప్రభుత్వం ప్రతి నెలా విడుదల చేస్తు న్న నిధులను సద్వినియోగం చేసుకునేందుకు పక్కాగా ప్రణాళికలు తయారుచేస్తున్నం. పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆమోదంతో పనులు చేస్తున్నం. గతంలో ఎన్నడూ ఇలా పంచాయతీలకు నిధులు విడుదల కావడం నేను చూడలేదు.