నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో మంగళవారం పలుచోట్ల మోస్తరుగా.. కొన్నిచోట్ల భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నీటి వనరులు మత్తడి దుంకుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో భారీ వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బొప్పారం వాగులోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడంతో లో లెవల్ కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో మండల కేంద్రం నుంచి ప్రతాపగిరి, మర్రిపల్లి, బొప్పారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతుల్వాయి వద్ద బొర్రవాగు లోలెవల్ కాజ్వేపై నుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం, మహాముత్తారం మండలాలకు రాకపోకలు స్తంభించాయి.
అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఆకేరువాగుపై ఇల్లంద, వర్ధన్నపేట, కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల చెక్డ్యాంలు నిండాయి. వర్ధన్నపేట చెక్డ్యాం మత్తడి పడుతున్నది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్దచెరువు మత్తడి దుంకుతున్నది. వరంగల్ అర్బన్ జిల్లాలో 1.34 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లాలో 1.93 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లిలో 4.23 సెం.మీ, ములుగులో 2.41 సెం.మీ, మహబూబాబాద్ జిల్లాలో 2.32 సెం.మీ, జనగామలో 3.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.