ఖిలావరంగల్, అక్టోబర్ 25 : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం విముఖత చూపుతున్నదని, వరి సాగు చేస్తే రైతులు నష్ట పోతారన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలైన శనగలు, వేరుశెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయలు పండిస్తే రైతులకు లాభాలు వస్తాయన్నారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం గిరిజన రైతులకు గిరి వికాసం పథకం గురించి అవగాహన కల్పించారు. ఐదు ఎకరాల భూమి ఉన్న గిరిజన రైతులకు ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో బోర్ సదుపాయం కల్పిస్తుందన్నారు. అర్హులైన గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జేడీ ఉషాదయాళ్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం రఘు, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం తాంబే తదితరులు పాల్గొన్నారు.
వెంటనే పరిష్కరించాలి..
ప్రజల నుంచి వచ్చే వినతులు, దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 43 మంది వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ పాల్గొన్నారు.
చౌక దుకాణాలను భర్తీ చేయాలి..
జిల్లాలో ఖాళీగా ఉన్న 39 చౌక దుకాణాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో కూడా విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని సివిల్ సప్లయ్ అధికారి లక్ష్మీభవానికి సూచించారు. తరుచుగా చౌక దుకాణాల పనితీరును పరిశీలించాలన్నారు. వినియోగదారుల నుంచి గ్యాస్ సిలిండర్కు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు వస్తే వెంటనే ఏజెన్సీ నిర్వాహకులపై విచారణ జరుపాలన్నారు. తూనికలు కొలతల అధికారులు చౌకదుకాణాల్లోని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను పరిశీలించాలన్నారు.
జిల్లాలో 7172 కొత్త రేషన్ కార్డులు..
జిల్లాలో ఈ ఏడాది జూలై వరకు 7172 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందజేశామన్నారు. 1031 కార్డులను రద్దు చేశామన్నారు. పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, ఆర్డీవో డీఎం భాస్కర్రావు, సీఈవో రాజారావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.