చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్లను పారదోలిన ఉద్యమ పతాక తెలంగాణ రాష్ట్ర సమితి తన ఇరవై ఏండ్ల పోరాట స్మృతులను నెమరువేసుకున్నది. ఒక్కరితో యుద్ధం మొదలు పెట్టిన నాడు ఎదురైన అవహేళనలు, అవమానాల నుంచి తెలంగాణలోనే నేడు బలీయమైన ప్రజాశక్తిగా ఎదుగుతూ వచ్చిన ప్రస్థానాన్ని సమీక్షించుకున్నది. తెలంగాణ పురోగతియే ఆది అంతిమ ప్రాథమ్యంగా నిర్ణయించుకొని ఆ సంకల్ప ఆచరణకు అహరహం శ్రమిస్తున్న పయనంపై ప్లీనరీలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఉద్యమ రథ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తలపెట్టిన ఒక రోజు ప్లీనరీకి యావత్ తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా తరలివచ్చారు. సభా వేదిక అంతా జై తెలంగాణ నినాదాల హోరుతో సాంస్కృతిక కార్యక్రమాల జోరుతో ధూంధాంల సందడితో మార్మోగింది. ఉద్యమ జ్ఞాపకాలు, స్వరాష్ట్రం సాధించిన విజయాలు, ప్రగతి నివేదికలతో చర్చలు, తీర్మానాలు, మేధోమథనాలు జరిగాయి. ఆయా జిల్లాల నాయకులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. క్షేమ సమాచారాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కాగా చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఎగ్ మసాలా, మటన్ దాల్చా, బోటి ఫ్రై, తలకాయ పులుసు, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారుతో వంటి మొత్తం 36 రకాల పసందైన రుచులతో ప్లీనరీ ఘుమఘుమలాడింది. ప్రవేశద్వారం సెల్ఫీ పాయింట్ గా మారింది. ఉద్యమ స్మృతులు, కేసీఆర్ జీవిత ఘట్టాలతో కలిపి 1500 ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు.
ప్లీనరీ హైలైట్స్
సభకు వచ్చిన ప్రతినిధులకు బ్యాగుతో కిట్స్ను అందజేశారు. కిట్లో ఎజెండా కాపీ, పార్టీ కండువా, జెండాలు, శానిటైజర్ బాటిల్, వాటర్ బాటిల్, స్నాక్ ప్యాక్ (లడ్డూ, బొంది) మాస్కులు, ఫేస్ మాస్కులు అందజేశారు.
సభకు వచ్చిన ప్రజాప్రతినిధుల్లో పురుషులు గులాబీ చొక్కాలు, మహిళలు గులాబీ రంగు స్కార్ఫ్లు, చీరలతో వచ్చారు.
వేదిక వద్దకు వచ్చిన ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకునేందుకు వలంటీర్లు జిల్లాల వారీగా ప్లకార్డులు పట్టుకుని కౌంటర్ల వద్దకు తీసుకువెళ్లారు. రెండు వైపులా ఏర్పాటు చేసిన 36 ప్రత్యేక కౌంటర్ల వద్ద ప్రతినిధులకు బ్యాగులు, పాస్లు అందజేశారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూంధాం పాటలు సభికులను అలరించాయి. పాటల సమయంలో పార్టీ ప్రతినిధులు డ్యాన్సులు, ఈలలతో సందడి చేశారు.
హెచ్ఐసీసీ వేదిక వైపు వచ్చే మార్గాల్లో స్వాగత తోరణాలు, రోడ్డుకు ఇరువైపులా సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఆకట్టుకున్నాయి.
ప్రవేశ ద్వారం నుంచి సభ వేదిక వైపు వెళ్లేందుకు 9 మెటల్ డిటెక్టర్ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు.
ప్లీనరీలో బ్యాగుల పంపిణీ కేంద్రాలు, భోజన కేంద్రాలు తెలిసేలా ప్రతి చోట బోర్డులు పెట్టడంతో పాటు వలంటీర్లను నియమించారు.
సభ ప్రాంగణం సమీపంలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను గ్యాలరీలకు పక్కనే కావాల్సినన్ని సమకూర్చారు.
మూడు మార్గాలలో సభ ప్రాంగణంలోకి ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. ముందు చూపుతో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఎవరికి నిర్ణయించిన మార్గాల్లో వారు గ్యాలరీలోకి చేరుకున్నారు.
హైటెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఒక రాజకీయ పార్టీ సమావేశంగా కాకుండా కార్పొరేట్ స్థాయిలో ఆద్యంతం హుందాగా సాగింది.
సభ ప్రాంగణంతో పాటు స్వాగత ద్వారం వద్ద కలిపి మొత్తం 10 డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. సభ వేదికపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షించారు.