మహబూబాబాద్, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ) : మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి. రాష్ట్రసాధనే లక్ష్యంగా, సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ సకలజనులూ అలుపెరుగుకుండా పోరాడుతున్న సందర్భమది. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి మానుకోట రాళ్ల ఘటన ఊపిరిపోసింది. తెలంగాణ వాదాన్ని ఎలాగైనా బలహీనపర్చాలన్న నాటి ఆంధ్రాపాలకుల కుతంత్రాలను అడ్డుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు జగన్ ఓదార్పుయాత్ర పేరుతో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. అందులోభాగంగా వరంగల్లో ఓదార్పుయాత్ర చేయాలని నిర్ణయించిన జగన్, మానుకోట నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎలాగైనా తెలంగాణ వాదాన్ని బలహీన పర్చాలన్న కుటిలనీతితో అధికార బలంతో ఉన్న సీమాంధ్ర నాయకులు ఓదార్పుయాత్రకు మద్దతు పలికారు.
ఇది తెలంగాణ ఉద్యమకారులను ఆగ్రహానికి గురిచేసింది. ఎలాగైనా ఓదార్పుయాత్రను అడ్డుకోవాలని తెలంగాణవాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఉద్యమకారులు, టీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు. 2010 మే 28న జగన్ హైదరాబాద్ నుంచి రైలుమార్గం ద్వారా మానుకోటకు వస్తున్నాడని తెలుసుకున్న ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు రగిలిపోయారు. ఓదార్పుయాత్ర కొనసాగితే తెలంగాణ ఉద్యమం పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని భావించి మానుకోట రైల్వేస్టేషన్కు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్కు అనుకూలంగా వచ్చిన సమైక్యవాదుల నినాదాలు.., ఉద్యమకారుల నిరసనలు ఓ వైపు.., మానుకోటను చుట్టముట్టిన పోలీసుల రక్షణ వలయం మరోవైపు.. అంతా టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పటికే జగన్ను రిసీవ్ చేసుకునేందుకు రైల్వేస్టేషన్కు వచ్చిన కొండా మురళి, సురేఖ, పుల్లా పద్మావతి, పుల్లా భాస్కర్ ఇతర నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు మధ్యగొడవ జరిగింది. జగన్ తరఫున వచ్చిన నాయకులు ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులపై తుపాకీలతో కాల్పులు జరిపారు. దీంతో తీవ్రఆగ్రహానికి గురైన వారు మానుకోట రాళ్లకు పని చెప్పారు. అదేరోజు జిల్లాకేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ‘గో బ్యాక్ ఆంధ్రా’ నినాదంతో ఉద్యమకారులు సభ ఏర్పాటు చేశారు. ఇందులో హరీశ్రావు, ఇతర పెద్దలు పాల్గొన్నారు.
మానుకోట రైల్వేస్టేషన్లో ఒకవైపు తుపాకీ తూటాలకు వెరవకుండా ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరుగడంతో వందలాదిమంది ఉద్యమకారులకు దెబ్బలుతగిలాయి. 13 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. దీంతో రైలులో మానుకోటకు బయలుదే రిన జగన్ను పోలీసులు జనగామ సమీపంలోనే ఆపి తిరిగి హైదరాబాద్కు పంపించారు. తెలంగాణవాదాన్ని నీరుగార్చాల ని కుట్రలు పన్నిన సమైక్యవాదులకు మానుకోట రాళ్లు గుణపా ఠం చెప్పాయి. తపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాయి. ఈ ఘటనతో తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా మే 28న మానుకోట రైల్వే స్టేషన్లోని రాళ్లకు ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వారం రోజులు జైలుకు పోయిన
ఓదార్పుయాత్ర పేరుతో మానుకోటకు జగన్ వస్తున్నాడని పదిరోజుల ముందుగానే తెలిసింది. ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నాం. ఆందోళనలు చేశాం. అదేరోజు నెహ్రూసెంటర్లో తెలంగాణపై ‘ఆంధ్రా పెత్తనం నశించాలి’.. ‘గో బ్యాక్ ఆంధ్రా నినాదం’తో సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యఅతిథిగా తన్నీరు హరీశ్రావును పిలిచాం. రైలుమార్గం ద్వారా జగన్ మానుకోటకు వస్తున్నాడని తెలిసింది. దీంతో అందరం రైల్వేస్టేషన్కు చేరుకున్నాం. ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకుల నినాదాలతో రైల్వేస్టేషన్ మార్మోగింది. ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై ఉన్న నాయకుల గన్మెన్లు రబ్బర్ బుల్లెట్లు, తుపాకీ తూటాలతో కాల్పులు జరుపడంతో వందలాది మంది ఉద్యమకారులకు గాయాలయ్యాయి. అది చూసి అక్కడ ఉన్న ఉద్యమకారులంతా రగిలిపోయారు. పట్టాలపై ఉన్న కంకర రాళ్లతో సమైక్యవాదులను తరిమికొట్టారు. ఈ ఘటనలో వందలాది మంది ఉద్యమకారులపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కేసులు పెట్టాడు. నేను కూడా వారం రోజులు జైలుకు పోయిన. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఎత్తేసింది. మానుకోట ఘటనను ఎప్పటికీ మరిచిపోను.