వరంగల్, సెప్టెంబర్ 29 : డాక్టర్ పట్టా పుచ్చుకుని బయటకు వెళ్తున్న వైద్య విద్యార్థులు సేవా దృక్పథంతో వైద్య సేవలందించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్కుమార్ సూచించారు. కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో 2014 సంవత్సరం బ్యాచ్ వైద్య విద్యార్థులకు బుధవారం డాక్టర్ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తిచేసిన విద్యార్థులు డాక్టర్లుగా పల్లె ప్రజలకు సేవలందించాలని అన్నారు.
అప్పుడే సమాజంలో డాక్టర్లుగా విలువ, గుర్తింపు పెరుగుతుందని వివరించారు. భావితరానికి కొత్త డాక్టర్లుగా పరిచయం అవుతున్న వారంతా వైద్య వృత్తికి గౌరవం తీసుకురావాలని కోరారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైద్య సిలబస్లో అనేక మార్పులు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా కాలం వైద్య రంగానికి అనేక పాఠాలు నేర్పిందని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు అంశాలపై అధ్యయనం చేసి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్య సిలబస్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి, డాక్టర్కు మధ్య దూరం పెరుగుతోందని దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్య విద్య సిలబస్లో అనేక కొత్త అంశాలు చేరుస్తున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు.
200 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన 2014 బ్యాచ్ విద్యార్థులకు డాక్టర్ పట్టాల ప్రదానోత్సవం కనులపండువగా జరిగింది. 200 మంది విద్యార్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్కుమార్ డాక్టర్ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పట్టాలు తీసుకున్న మెడికోలు కేఎంసీలో కేరింతలు కొట్టారు. తమ పిల్లలు డాక్టర్ పట్టాలు తీసుకుంటుండగా తల్లిదండ్రుల ఆనందంతో చప్పట్లు కొట్టారు. మరికొందరు ఉద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలుపదాసు చంద్రశేఖర్ పాల్గొన్నారు.