అన్నదాతలకు శాపంలా మారిన కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీయేతర అఖిలపక్షాలు సోమవారం కదం తొక్కాయి. సాగురంగాన్నే ప్రశ్నార్థకం చేసే వీటిని అమలు చేయవద్దని గళమెత్తాయి. 40రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించగా జిల్లాలో ‘భారత్ బంద్’ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వ్యాపార సంస్థలపై బంద్ ప్రభావం పడింది. వర్షం కారణంగా వివిధ పార్టీల నేతలు ముందుగా అనుకున్న కార్యక్రమాలను నిర్వహించలేకపోయారు. తెల్లవారుజామున పలుచోట్ల ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన తెలుపుతూ బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అంతటా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు.
నమస్తే నెట్వర్క్: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకొని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన భారత్బంద్ వరంగల్ అండర్ రైల్వేగేటు ప్రాంతంలో పాక్షింగా ముగిసింది. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం రవిబాబు పర్యవేక్షణలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు ఆధ్వర్యంలో వరంగల్ 27వ డివిజన్ పరిధిలోని రైతు భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు.
వరంగల్ పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య కే్రందాలను బంద్ చేయించి, రైల్వే జంక్షన్లో ధర్నా నిర్వహించారు. సీపీఐ, సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు సీహెచ్ రంగయ్య, మేకల రవి, ఆర్ కృష్ణ వరంగల్ రైల్వేస్టేషన్ జంక్షన్ నుంచి వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్, బట్టల బజార్ మీదుగా పాతబీటుబజార్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. గీసుగొండలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు తెలిపారు.
నర్సంపేటలో అఖిల పక్షం నాయకులు పెద్దారపు రమేశ్, డేగల శ్రీనివాస్, పెండెం రామానంద్, ఎలకంటి రాజేందర్, గుంపెల్లి మునీశ్వర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట-వరంగల్ రోడ్డు కూడలిలో రాస్తారోకో చేశారు. ప్రజా పోరాటాల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్లో సంపూర్ణంగా పాల్గొన్నాయి. ముగ్ధుంపురం గ్రామ శివారు నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలో ఉన్న బంక్ను అఖిలపక్ష నాయకులు బంద్ చేయించారు.
నెక్కొండలో జోరు వానలోనూ టీపీసీసీ అధ్యక్షుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, న్యాయవాది బండి శివకుమార్, సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు, సీపీఎం మండల కార్యదర్శి వెంకన్న తదితరులు బంద్లో పాల్గొన్నారు. చెన్నారావుపేటలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా గోపాల్నాయక్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఖానాపురంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దుగ్గొండి, గిర్నిబావిలో కాంగ్రెస్, సీపీఎం, ఎంసీపీఐ(యూ), రైతు సంఘాల బాధ్యులు రాస్తారోకో చేశారు. నల్లబెల్లిలో ఎంసీపీఐ(యూ) మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య, నాగరాజు, సీపీఎం మండల కార్యదర్శి కడియాల వీరాచారితోపాటు పలు పార్టీల నాయకులు బంద్లో పాల్గొన్నారు.
సంగెంలో అఖిలపక్షం నేతలు దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. విద్యాసంస్థలకు వెళ్లిన నాయకులు బంద్ చేయించారు. అంబేద్కర్ కూడలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యానాయక్, ఎంసీపీఐ(యూ) మండల నాయకుడు అరుణ్నాయక్ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలను బంద్ చేయించారు.