సంగెం, సెప్టెంబర్ 27: గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సంగెం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తాసిల్దార్లకు సూచనలు చేశారు. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. చెరువు, కుంటల్లోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్య్సకారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండొద్దని ప్రజలను కోరారు. మరో 48 గంటలపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ విశ్వనారాయణ, డీటీ రాజేశ్వర్రావు, కార్యాలయ ఉద్యోగులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నర్సంపేట డివిజన్లోని దుగ్గొండిలో 11.6 మీ.మీ, నల్లబెల్లిలో 8.8మీ.మీ, నర్సంపేటలో 12.2 మీ.మీ, ఖానాపురంలో 20.2 మీ.మీ. చెన్నారావుపేటలో 13.6 మీ.మీ, నెక్కొండ మండలంలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. చెరువులు, కుంటలు, అలుగు పోస్తున్నాయి. నెక్కొండ మండలంలోని నాగారం గ్రామ పెద్దచెరువు కట్ట కుంగిపోయింది. సర్పంచ్ జల్లె సుదర్శన్, రైతులు సోమవారం గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఐబీ డీఈ వెంకటరమణ, ఏఈ కిరణ్మయి చెరువుకట్టను పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు.
చెన్నారావుపేట మండలంలోని చెరువులన్నీ మళ్లీ మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దుగ్గొండి మండలంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పంట చేలల్లోకి నీరు చేరింది. నల్లబెల్లి మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలకు పంట చేలు జాలువారే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. గీసుగొండ మండలవ్యాప్తంగా ఎడాతేరిపి లేకుండా వర్షం కురిసింది. కొమ్మాల, మచ్చాపురంలో రైతులు ఆరబోసిన మక్కలు తడిశాయి.