వరి, పత్తి వేసి నష్టపోయే బదులు.. కూరగాయలు పండిస్తే మేలని భావించింది. తన వద్ద భూమి లేకపోవడంతో ఏడెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేసింది. నాలుగెకరాల్లో మిర్చి, మిగతా స్థలంలో బీర, కాకర, సోరకాయలు వేసి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మంచి కాత వస్తుండడంతో తన చేను వద్దే అమ్ముకుంటూ లాభాలు గడిస్తోంది కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన వక్కల వసంత.
శనిగరం గ్రామానికి చెందిన వసంత-సదానందం దంపతులకు 20గుంటల వ్యవసాయభూమి, ఒక ట్రాక్టర్ ఉంది. చేతి నిండా పనిలేకపోవడంతో ఊళ్లోనే ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. నాలుగు ఎకరాల్లో మిర్చి తోట, ఎకరం భూమిలో బీర, సోర, కాకర ఎకరమున్నరలో కంది వేశారు. మిర్చి, కంది కొంత ఆలస్యంగా వస్తాయి కాబట్టి బీర, సోర, కాకర పంటలు వేశారు. గతేడాది పత్తి పెడితే నష్టపోయారు. అందుకే ఈ ఏడాది కూరగాయల పంటను ఎంచుకున్నారు. నెలన్నర క్రితం బీర విత్తనాలు వేశారు. తీగలు పారుతుండడంతో పందిరి వేసి తీగలు పారేలా చేశారు.
ఇప్పుడు కాతకు రావడంతో రోజు ఉదయం, సాయంత్రం తెంపి చేనువద్ద, ఊళ్లో అమ్ముతున్నారు. పరకాల-హుజూరాబాద్ రోడ్డు పక్కనే తాజాగా బీరకాయలు దొరుకుతుండడంతో ఆ దారిన వెళ్లే వారు ఇష్టంగా తీసుకెళ్తున్నారు. కిలో బీరకాయలు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. మూడు నెలల పాటు కాత వస్తుందని ప్రతి రోజు అమ్మగా మిగిలినవి కమలాపూర్ కూరగాయల మార్కెట్లో అమ్ముతానని వసంత చెబుతోంది. రోజుకు 20 నుంచి 30 కిలోల దాకా విక్రయిస్తూ లాభాలు పొందుతోంది. రైతులు వరి, పత్తి సాగు చేసి నష్టపోకుండా కూరగాయలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని చెబుతోంది.