వరంగల్, సెప్టెంబర్ 21( నమస్తే తెలంగాణ) : గ్రామీణ, పట్టణ ప్రాంతంతో కూడిన జిల్లా ఇది. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు కావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతంలో పల్లె ప్రగతి, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలతో పాటు వరంగల్ నగరంలో పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ లక్ష్యం మేరకు ముందుకు తీసుకెళ్లడం అవసరం. పల్లె, పట్టణ ప్రగతి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడూ సమీక్ష జరుగుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. కరోనా కట్టడికి వంద శాతం వ్యాక్సినేషన్ టార్గెట్తో స్పెషల్ డ్రైవ్ నడుస్తున్నది. త్వరలో పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యాలపై ఫోకస్ పెట్టినట్లు వరంగల్ కలెక్టర్ బీ గోపి చెప్పారు. ఇటీవలే కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధమ్యాలే తన ప్రాధాన్య అంశాలని చెప్పారు. కలెక్టర్ బీ గోపి ఏమన్నారంటే ఆయన మాటల్లో..
పంటల మార్పిడిపై రైతులకు అవగాహన
వ్యవసాయపరంగా జిల్లాకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ రైతులు పత్తి, వరి, మిర్చి, వేరుశనగ, పసుపు, మక్కజొన్నతో పాటు ఇతర పంటలు పండిస్తున్నారు. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నారు. పంటల మార్పిడి విధానం పాటించకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తున్నది. వరసగా ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎప్పటికప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుని సాగు చేయాలి. తద్వారా మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుంది. లాభాలు కనపడుతాయి. పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తం. ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రభుత్వం చెపుతున్నది. ఈ పంట సాగు చేసిన రైతులకు సబ్సిడీ కూడా వస్తుంది. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఇప్పటికే జిల్లా నుంచి రైతులను ఇతర జిల్లాలకు తీసుకెళ్లి ఆయిల్ పామ్ తోటలను చూపించాం. రైతులు కూడా ఫిజికల్గా చూడాలి కదా. ముందుగా వారికి అవగాహన ఉండాలి. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట గ్రామం వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
పంటల కొనుగోలుకు పక్కా ప్లాన్
మరి కొద్దిరోజుల్లో రైతుల చేతికి పంట దిగుబడులు రానున్నాయి. పత్తి, వాన కాలం ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నం. పత్తి కొనుగోలుపై కొద్ది రోజుల క్రితం మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించాం. వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు కూడా వెళ్లొచ్చి గోదాములనూ పరిశీలించాను. రైతులకు ఇబ్బంది కలుగకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వాన కాలం ధాన్యం కొనుగోలుపైనా పౌరసరఫరాల శాఖతో పాటు ఇతర అధికారులతో కొద్దిరోజుల క్రితం సమీక్ష చేశాను. గత సంవత్సరం వాన కాలం ధాన్యం కొనుగోలు సమయంలో నిర్వహించిన 174 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రతిపాదించారు. అందుబాటులో ఉండేలా రైతులకు అవసరమైనచోట కచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పాను. కొనుగోలు కేంద్రాలు కొన్ని పెరిగినా పెరుగొచ్చు. గత ఏడాది రైతు ఉత్పత్తి సంఘా(ఎఫ్పీవో)లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొన్నింటిని కేటాయించారు. ఈ సారి ఎఫ్పీవోలకు ప్రాధాన్యం ఇచ్చి మరిన్ని సెంటర్లను కేటాయించాలనే ప్రతిపాదనలొస్తున్నాయి. ధాన్యం కొనుగోలు, రవాణాలో సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నం. జిల్లాలో గోదాముల వసతిని కూడా పెంచే దిశలో ఆలోచనలు చేస్తున్నం.
1,004 చెరువుల్లో చేప పిల్లలు
చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లలను వదలడం ప్రారంభమైంది. జిల్లాలో 1,004 చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 2.75 కోట్ల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో పోసేందుకు ప్రణాళికలు తయారు చేశాం. వారం రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువులు, రిజర్వాయర్లలోనూ ఉచిత చేప పిల్లలను వదలడం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉచిత చేప పిల్లల పథకం ద్వారా జిల్లాలో 158 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 15,550 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
రోజుకు పది వేల మందికి టీకాలు
కరోనా కట్టడి కోసం వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం. ఈ క్రమంలో పద్దెనిమిదేళ్ల వయసుపైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఈ నెల 16న ఈ కార్యక్రమం మొదలైంది. జిల్లాలో ప్రతిరోజూ సగటున పది వేల మందికి వ్యాక్సినేషన్ జరుగుతున్నది. స్పెషల్ డ్రైవ్లో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ 50 వేలు దాటింది. జిల్లాలో 18 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ త్వరలోనే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. బుధవారం నుంచి వ్యాక్సినేషన్ వేగవంతం కానుంది.
త్వరలో జాయింట్ సర్వే
చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు గుర్తించాం. నియంత్రించడానికి చెరువుల ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి హద్దులను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నం. దీనికి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో జాయింట్ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నం. ప్రయోగాత్మకంగా ఇక్కడ ఒక మేజర్ చెరువును సెలక్ట్ చేసి జాయింట్ సర్వే నిర్వహిస్తం. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి హద్దులను ఏర్పాటు చేస్తం. తర్వాత ఇతర చెరువుల్లో ఈ కార్యక్రమం చేపడుతం. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసే ముందు చెరువు శిఖంలో భూములు ఉన్నవారికి సమాచారం ఇస్తం. వారి సమక్షంలోనే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నం. ఎఫ్టీఎల్ను జియోట్యాగింగ్ చేస్తం. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి హద్దులను ఏర్పాటు చేయటం ద్వారా చెరువుల శిఖం భూముల ఆక్రమణకు అడ్డుకట్ట పడే అవకాశంఅవకాశం ఉంటుంది.