సొంతింటి కల సాకారమైన వేళ జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామంలో సంబురం అంబరాన్నంటింది. గూడు లేని పేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామనే సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ.2.57కోట్లతో 41 ఇండ్లు కట్టివ్వగా మంగళవారం పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉదయమే తమ ఇళ్లకు మామిడి ఆకులు, బంతిపూలతో తోరణాలు కట్టగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో గృహప్రవేశం చేశారు. అనంతరం పట్టాలు అందుకొని మురిసిపోయిన లబ్ధిదారులు.. నీడనిచ్చిన సర్కారుకు రుణపడి ఉంటామని చెప్పారు.
పట్టలేని ఆనందం
సొంతిల్లు లేని పేదల కలను నిజం చేసిన కేసీఆర్కు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం పెద్దపహాడ్లో 41 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరు భాస్కర్రావుతో కలిసి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని, దేశ ప్రధాని మోడీయే తెలంగాణ పథకాలను ప్రశంసించారని గుర్తుచేశారు. గ్రామంలో రూ.2కోట్ల 57లక్షల 89వేల ఖర్చుతో ఇండ్లు నిర్మించి ఇచ్చామని, ఇంకా అర్హులైన వారికి కూడా మంజూరు చేస్తామని తెలిపారు. సమైక్య పాలనలో తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులున్నా పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో ఏ పల్లెను చూసినా సెలయేళ్లు పారుతూ కోనసీమను తలపిస్తున్నదన్నారు.
24గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా, గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ఎంతోమందికి లబ్ధిచేకూర్చుతున్నదని చెప్పారు. జనగామ పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ.115 కోట్ల అంచనాతో కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ప్రతిపక్ష ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రజలు తప్పకుండా కొవిడ్ టీకా వేసుకోవాలని, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా టీకాలు ఇస్తున్నదన్నారు. టీకాలు తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మేకల కలింగరాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్దిలింగం, వైస్ ఎంపీపీ గద్ద చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ దామోదర్, సీపీవో ఇస్మాయిల్, సర్పంచ్లు గుండా శ్రీలత, గుగులోత్ మంజుల, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ భూరెడ్డి ప్రమోద్రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, ఎంపీడీవో బిరుదు హిమబిందు, తహసీల్దార్ రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్లపల్లి రవి పాల్గొన్నారు.
నిజంగా ఇది మరిచిపోలేని రోజు
మాలాంటి పేదలకు అండగా ఉన్న కేసీఆర్ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం. ఇన్నాళ్లూ సొంతిల్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ప్రభుత్వమే ఇల్లు కట్టించి పట్టా చేతికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది మరిచిపోలేని రోజు.
నీడనిచ్చిన సర్కారును మరువం..
మాసోంటోల్లకు ఇండ్లు కట్టించి నిడనిచ్చింది ప్రభుత్వం. పేదలకు ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేసి ఇంటితో పాటు పట్టా అందించడం మరిచిపోలేని దినం ఈ రోజు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మేలు మరువం. పేదలను పట్టించుకుంటున్న ప్రభుత్వం సల్లంగ ఉండాలె.