జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకతీయ రాజులు అనేక ఆలయాలు నిర్మించారు. వాటిలో పాలకుర్తి మండలం చెన్నూరు, వావిలాల, విస్నూరులలో త్రికూటాలయాలు నిర్మించారు. గూడూరులో కాకతీయ రాజు మిర్యాల వంశస్థుడు మల్లన్న 1124లో మల్లేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు రామస్వామి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. పాలకుర్తిలో పాలంపేట, లింగాలఘనపురం మండలంలోని కాకతీయుల ఆడబిడ్డ కుందమంబ పేరు మీద కుందావరం, చీటూరులో త్రికూటాలయం, వనపర్తిలో శివాలయం, రెండు శాసనాలు ఉన్నాయి. అలాగే రఘునాథపల్లి మండలం నిడిగొండలో త్రికూటాలయం, బచ్చన్నపేట మండలం కొన్నెలో త్రికూటాలయం, కొడవటూరులో వినాయకుడి గుడి, త్రికూటాలయం, దేవరుప్పుల మండలం మాధపురం శివారు దేవునిగుట్ట తండాలో త్రికూటాలయాలు.. ఇలా చాలాచోట్ల ఆలయాలు కట్టించారు. పురావస్తు శాఖ అధికారులు మాత్రం నిడిగొండ, స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామాల్లో కట్టిన కట్టడాలను మాత్రమే గుర్తించినా పునరుద్ధరణను గాలికి వదిలేశారు.
గూడూరులో ప్రతిష్ఠించిన శిలాశాసనం ప్రభుత్వ రికార్డుల్లోనే లేకపోవడం సమైక్య పాలకుల వివక్షకు అద్దంపడుతోంది. అలాగే చెన్నూరులో ఉన్న త్రికూటాలయం, రామాలయం శిథిలావస్థకు చేరుకున్నాయి. బమ్మెరలోని శివాలయం, వావిలాలలోని ఆలయాలు కూలిపోయే దశలో ఉన్నాయి. బచ్చన్నపేట చీటూరులోని ఆలయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. గూడూరులో లక్క సముద్రం చెరువు కనుమరుగవుతోంది. ఈ నేపథ్యంలో కాకతీయరాజుల కళా సంపదకు పూర్వవైభవం తేవాలని చరిత్రకారులు, ప్రజలు కోరుతున్నారు.
నిడిగొండ త్రికూటాలయానికి ఘన చరిత
నిడిగొండలో కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం కాలగర్భంలో కలిసిపోతోంది. మహాదేవరాజు కుమారుడు గణపతి చక్రవర్తి పాలనలో తన చెల్లెలు కుందమాంబకు పసుపు కుంకుమ కింద నిడిగొండ గ్రామాన్ని ఇనాంగా ఇచ్చిన్నట్లు చరిత్ర చెబుతోంది. దీంతో అన్నకు గుర్తుగా కుందమాంబ నిడిగొండలో గుట్ట్టకు తూర్పుదిక్కున మూడెకరాల స్థలంలో 500 స్తంభాలతో త్రికూటాలయాన్ని నిర్మించింది. ఆలయానికి మూడు వైపులా గర్భగుడి కలిగి ఉండేది. ఆలయం పడమరన శివుడు, తూర్పున సూర్యుడు, ఉత్తరాన వాసుదేవుని విగ్రహాలు ఉన్నాయి. సూర్యకిరణాలు శివలింగంపై పడేలా దీనిని నిర్మించారు. మూడింటికి ఒకే కప్పు ఉండడంతో కాకతీయులు త్రికూటాలయంగా పేర్కొన్నారు. ఆలయం పక్కనే ఉన్న కోనేరు నుంచి గుట్ట వద్ద ఉన్న శివాలయం వరకు భూమిలోంచి కిలోమీటరు వరకు గుర్రాలతో బయటకు వెళ్లేలా సొరంగం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నాడు వేల మంది బ్రాహ్మణులు నివాసం ఉన్నట్లు చెబుతున్నారు.
నిత్యం పూజలు జరిగే ఆలయం పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నేడు శిథిలావస్థలో ఉంది. త్రికూటాలయాన్ని పునరుద్ధరిస్తే మరో వెయ్యి స్తంభాల ఆలయంగా వెలుగొందుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన త్రికూటాలయాన్ని సీమాంధ్ర పాలనలో పురావస్తుశాఖ అధికారులు రెండు దశాబ్దాల క్రితం పునరుద్ధరణ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. మొదటి దఫా రూ.20లక్షలు, రెండో దఫా రూ.16 లక్షలు నిధులను మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేసి చేతులు దులుపుకొన్నాడు. దీంతో ఆలయ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఎంతో విలువైన అపరూప శిల్పాలను కొన్నింటిని ఇక్కడినుంచి అధికారులు హనుమకొండ వెయ్యి స్తంభాల గుడికి తరలించారని, మరికొన్ని విగ్రహాలు కాలగర్భంలో కలుస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆలయానికి పూర్వవైభవం తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చెన్నూరును పర్యాటకంగా తీర్చిదిద్దాలి
కాకతీయ రాజులు చెన్నూరులో త్రికూటాలయం నిర్మించారు. అందులో శివలింగం, రామాలయం గుండం ఉంది. సమైక్య పాలకులు, పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయం శిథిలావస్థకు చేరింది. గోపురం కూడా కూలిపోయిం ది. నంది విగ్రహం, శివలింగం ధ్వంసమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి చెన్నూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
కట్టడాలను పరిరక్షించాలి
సమైక్య పాలనలో వివక్షకు గురైన తెలంగాణ చరిత్ర ను, భాషా సాంస్కృతి సంప్రదాయాలతో పాటు కాక తీయుల కళా కట్టడాలను పరిరక్షించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని పునరు ద్ధరించి భావితరాలకు అందించాలి. పురావస్తు శాఖ అధికా రులు స్పందించి వాటికి గుర్తింపు తేవాలి.
మ్యూజియం ఏర్పాటుచేయాలి
కాకతీయరాజుల చారిత్రక కట్టడాలు, ఆలయాలకు పూర్వవైభవం రావాలి. ఇప్పటికే బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, వల్మిడి రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేస్తోంది. పనులు కూడా దాదాపు పూర్తికావచ్చాయి. పూర్వ వరంగల్ జిల్లాలో ఊరూరా కాకతీయుల కా లం నాటి ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని గుట్టలను ఎకో టూరిజం కింద అ భివృద్ధి చేయాలి. ఆలయాలు లేకుండా విడిగా ఉన్న విగ్రహాలను ఒకేచోట చేర్చి మ్యూజియం కట్టించాలి.