కమలాపూర్/కాశీబుగ్గ, జూలై 9 : గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలె.. అయినా సీఎం కేసీఆర్ నెలకు రూ.300 కోట్లు గ్రామపంచాయతీలకు ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో పల్లె ప్రగతి, గ్రేటర్ వరంగల్ 18వ డివిజన్లోని క్రిస్ట్టియన్కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఏం పనిచేసినయ్.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏం పనులు జరిగాయో ప్రజలు చర్చించుకోవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 4వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేసీఆర్ డబ్బులు ఇస్తే, ఒక్క ఇల్లు కట్టలేదని, ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ను ప్రజలు నిలదీయాలన్నారు. ‘40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశా ను.. అందులో ఎన్టీఆర్, కేసీఆరే నాకు నచ్చారు.. ఎన్టీఆర్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తి’ అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.8వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మండలానికి ఐదు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అన్ని వర్గాల పిల్లలు అందులోనే చదివేలా వసతులు కల్పిస్తామని, అందుకు ప్రజల సహకారం కావాలన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా రూ.2వేల కోట్లతో వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నా రు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతిలో చేయాల్సిన పనులను శాఖల వారీగా అడిగి తెలుసుకొని అధికారులకు చెమలు పట్టించారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపునకు మొదట నోటీసులు ఇవ్వాలని, అయినా యజమానులు స్పందించకపోతే ప్రభుత్వపరం గా వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేయాలన్నారు. నెల రోజుల్లో ఇం టింటికీ భగీరథ నీళ్లు ఇవ్వాలని ఏఈ, డీఈలను ఆదేశించారు. గ్రామాల్లో తుప్పుపట్టిన, వంగిన స్తంభాలు, లూజ్ లైన్లు తొలగించారా? డీఈ భిక్షపతిని ప్రశ్నించగా, పనులు చేస్తున్నట్లు బదులిచ్చాడు. కమలాపూర్మండలాన్ని ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తాను ద త్తత తీసుకున్నాం..20రోజుల్లో మళ్లీవస్తా..వంగిన స్తం భాలు ఉంటే చర్యలు తప్పవని డీఈని మంత్రి హెచ్చరించారు.
మరో పది రోజులు పట్టణ ప్రగతి
గ్రేటర్ పరిధి ఎక్కువగా ఉన్నందున పట్టణ ప్రగతిని మరో పదిరోజులు పెంచుకొని వరంగల్ రూపు రేఖలు మార్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి కూల్చి వేయాలని, సహకరించని వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కష్టపడి పనిచేసే తత్వం కలిగిన నాయకుడని, తనకు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని అన్నారు. తూర్పు అభివృద్ధికి తన సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్మన్ సుధీర్బాబు, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్, డిప్యూటీ మేయ ర్ రిజ్వానాషమీమ్ సుల్తాన్, కార్పొరేటర్ బాబు, సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్రావు, జడ్పీటీసీ కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, ఎంపీటీసీలు సంపత్రావు, అరుణ, డీఆర్డీవో శ్రీనివాసకుమార్, డీపీవో జగదీశ్వర్, ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ జాహెద్పాషా, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు.