నర్మెట, సెప్టెంబర్ 18: మండంలోని వెల్దండ గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వివరించారు. ఈ మేరకు పరిశోధన చేస్తున్న ఆయన శనివారం గ్రామంలోని పలు చారిత్రక అంశాలను విలేకరులతో పంచుకున్నారు. గ్రామంలో ముక్కుపోగు వేణుగోపాలస్వామికి అంత్యంత చారిత్రక విశిష్టత ఉందని చెప్పారు. 16 స్తంభాలపై నిర్మించిన ఈ గుడిలో రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు మురళిని వాయిస్తూ దర్శనమిస్తాడు. రుక్మిణి, సత్యభామ విగ్రహాలతో సమాన పొడవు ముక్కు కలిగి ముక్కుపోగు ధరించిన కృష్ణుడి విగ్రహం ఇక్కడ విశేషం. తౌడు చెరువు పైభాగాన చిట్టెపు రాళ్లగడ్డ సమీపంలో నిమ్మలమ్మ గుడి ఉంది. ఈ ఆలయం డోలమైన్ నిర్మాణంలో ఉంది.
ఎటూ పది అడుగుల సల్పలాంటి కప్పు బండను నిలుపుతూ కింద రాతి ఫలకలే స్తంభాలుగా ఉన్నాయి. ఇక్కడ మట్టిలో కూరుకుపోయిన రెండు శిల్పాల్లో ఒకటి చాముండి, రెండోది కాకతి అయి ఉండవచ్చని రత్నాకర్రెడ్డి తెలిపారు. మరో విగ్రహం తలపై సిగముడికి భిన్నంగా ఉన్న పురుష విగ్రహం, వాటి ఎదుట నాగశిల ఉన్నాయి. గ్రామంలోని గంటెమ్మ గుట్టపై డోలమైన్ సమాధులు ఉన్నాయి. క్వారీ పనుల్లో భాగంగా వాటిని తొలగించారు. గంటెమ్మ చెరువు ఈ గుట్టకు ఆనుకునే ఉంది. ఈ గుట్టపై త్రిభుజాకారంలో రాతిని చెక్కి దానిపై వేసిన చిత్రం ఆకట్టుకుంటున్నది. పూర్వం ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతాలను చిట్టెపు రాళ్ల గడ్డ అనేవారు. ఏకంగా చిట్టెపు రాళ్లతోనే కట్టిన గోడలు వెల్దండలో ఉన్నాయి. ఇక్కడి తౌడు చెరువు పైభాగాన ఇనుము, ఉక్కు పరిశ్రమ విలసిల్లినట్లు తెలుస్తున్నది. ఇవే కాకుండా గ్రామంలో రాజన్న గుడులు, చేతిలో దంతం పట్టుకున్న వినాయకుడు, కాకతీయుల నాటి నంది, కర్రతో శిల్పాలుగా మలిచి తయారుచేసిన అందమైన దర్వాజలు, రాకాసి స్తంభం, అనేక చోట్ల ఉన్న రాకాసి గూళ్లు నాటి ఘన చరిత్రకు అద్దం పడుతున్నాయి.