స్టేషన్ ఘన్పూర్/చిల్పూర్/కాజీపేట/వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 16 : ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్యచేసిన ఘటనలో నిందితుడు పల్లకొండ రా జు (35) గురువారం ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బృందాలుగా ఏర్పడి పోలీసులు వెంటాడడం, చేసిన ఘోరం నుంచి బయటపడే దారు లు మూసుకుపోవడంతో ఎనిమిది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు చివరికి జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని చిన్నపెండ్యాల-నష్కల్ రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్పై గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్కు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు.
హైదరాబాద్లోని సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చైత్రపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసిన ఘటనలో రాజు నిందితుడు కాగా అతడి కోసం వారం నుం చీ పోలీసులు వెతుకున్నారు. పోస్టర్లు అంటించి జల్లెడ పడుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కా ర్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉద యం రాజారాం బ్రిడ్జి రైల్వే ట్రాక్పై అనుమానాస్పదంగా తిరుగుతూ కీమెన్ తాటికుమార్కు రాజు కనిపించాడు. వివరాలు అడుగుతుండగానే తప్పించుకొని చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడి నుంచి కీమెన్ వెళ్లగానే అదే సమయంలో కోణార్క్ ట్రైన్ వస్తుండగా ఎదురెళ్లి దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్ పక్కన గల రైతులు భూక్యా గేమ్సింగ్, భూక్యా రామ్సింగ్ గుర్తిం చి కీమెన్లు కుమార్, సారంగపాణికి చెప్పారు. వారు 100కు, జీఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చా రు.
స్టేషన్ ఘన్పూర్ ఎస్ఐలు రమేశ్నాయక్, శ్రీనివా స్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతడి చేతిపై మౌనిక అని పచ్చబొట్టుతో రాసి ఉండడం చూసి రాజేనని నిర్ధారించుకున్నారు. సీపీ తరుణ్ జోషి, జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ రఘునాథ్ వైభవ్, కాజీపేట జీఆర్పీఎఫ్ సీఐ రామ్మూర్తి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. నిందితుడి తండ్రి ఊరు కొడకండ్ల కావడంతో అక్కడికి వెళ్లేందుకు రాజు ట్రాక్ వెంట నడుచుకుంటూ వచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నా రు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీఎఫ్ ఎస్ఐ అశోకుమార్ చెప్పారు.
ప్రజల్లో హర్షం..
చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో నిందితుడి మృతదేహాన్ని చూసేందుకు చుట్ట పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కామాంధుడు చనిపోయాడంటూ మృతుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కుటుంబ సభ్యులు గుర్తించారు : సీపీ తరుణ్ జోషి
ఘటనా స్థలంలో సీపీ తరుణ్జోషి మాట్లాడుతూ నిందితుడు రాజు ఫొటోలను కుటుంబసభ్యులకు పంపగా వారు గుర్తించారని తెలిపారు. రాజును పట్టుకునేందుకు అతడి ఫొటోలతో ప్రచారం చేశామని, కూడళ్లు రహదారుల వెంట గోడలపై పోస్టర్లు అంటించామని చెప్పారు. అతడు తప్పించుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చేతులపై పచ్చబొట్టుతో రాసి ఉన్న పేర్లను, వేసుకున్న బట్టల ఆధారంగా రాజేనని గుర్తించామని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు కూడా చేయిస్తామని తెలిపారు.
ఎంజీఎం దవాఖానకు కుటుంబసభ్యులు..
రాజు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించగా సాయంత్రం 4గంటల సమయంలో అతడి బావమరదులు కేదరి సురేశ్, మహేశ్ దవాఖానకు వచ్చారు. ప్రత్యేక వాహనంలో మృతుడి తల్లి, సోదరితో పాటు అతడి భార్యను కూడా పోలీసులు ఎంజీఎంకు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు గుర్తించిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు రజామాలిక్ బృందం, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యబృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. అనంతరం మట్టెవాడ పోలీసులు, గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు పోతన నగర్ శ్మశాన వాటికలో అతడి తల్లి చేతుల మీదుగా అంత్యక్రియలు చేయించారు. మృతదేహాన్ని ఎంజీఎంకు తీసుకువస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పును విసిరివేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు.