హనుమకొండ జేఎన్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. గురువారం మెన్, ఉమెన్ 20కేఎం రేస్వాకింగ్, డెకాథ్లాన్ ఈవెంట్లు, ఉమెన్స్కు హార్డిల్స్, రిలే పరుగు పందెం నిర్వహించారు. ప్లేయర్లు సింథటిక్ ట్రాక్పై పోటాపోటీగా అద్భుతమైన ప్రతిభ చాటారు. వివిధ ఈవెంట్లలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు నిట్లో 20 కిలోమీటర్ల రేస్వాకింగ్, ఆ తర్వాత జేఎన్ఎస్లో డెకాథ్లాన్-10 ఈవెంట్లు నిర్వహించారు. ఇందులో 110 మీ హార్డిల్స్, డిస్కస్త్రో, పోల్ వాయుల్ట్, జావెలిన్త్రో, 1500 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. వీటితో పాటు 110ఎం హార్డిల్స్(రౌండ్-1, మెన్, ఉమెన్), షార్ట్పుట్(పురుషులు-క్వాలిఫైయింగ్ రౌండ్ గ్రూప్-ఏ), 4×400 మీటర్స్ రిలే(మిక్స్డ్ రౌండ్-1) పోటీలు నిర్వహించారు.
రేస్ వా‘కింగ్’లు
నిట్లో 20కేఎం రేస్వాకింగ్ హోరాహోరీగా సాగింది. ఈ పోటీలను డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు ప్రారంభించారు. మెన్ కేటగిరీ నుంచి పది మంది క్రీడాకారులు, ఉమెన్ విభాగం నుంచి ఏడుగురు ఈ రేసులో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో 20 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉత్తరాఖండ్ అథ్లెట్ చందన్సింగ్ ముందువరుసలో నిలిచాడు. ఆర్మీలో నాయక్ సుబేదార్గా అయిన ఈ క్రీడాకారుడు ఒక గంటా 29 నిమిషాల 21 సెకన్ల టైమింగ్తో పూర్తిచేసి స్వర్ణం సాధించాడు. అలాగే 1.29.25 టైమింగ్తో దేవేందర్సింగ్(ఆర్మీ) ద్వితీయ స్థాయంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, మూడో స్థానంలో 1.29.38 టైమింగ్తో హర్యానాకు చెందిన జూనీద్ కాంస్యం పొందాడు.
‘డెకాథ్లాన్’ విజేత యమన్దీప్ శర్మ
అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కీలక ఈవెంట్ డెకాథ్లాన్(పురుషులు) పది ఈవెంట్స్ రెండవ రోజు ఉదయం, సాయంత్రం ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో
యమన్దీప్శర్మ విజేతగా నిలిచాడు. మొత్తం పది ఈవెంట్ల(100మీటర్స్, లాంగ్జంప్, షార్ట్పుట్, హైజంప్, 400 మీటర్స్, 110 మీటర్స్ హర్డల్స్, డిస్కస్త్రో, పోలె వాయుల్ట్, జావెలిన్త్రో, 1500(ఫైనల్) మీటర్ల పరుగుపందెం)ల్లో క్రీడాకారులు అమీతుమీ తేల్చుకున్నారు. ఇందులో రాజస్థాన్కు చెందిన యమన్దీప్శర్మ మొదటినుంచీ ముందువరుసలో ఉంటూ 16,800 పాయింట్లతో ఫస్ట్ప్లేస్లో నిలిచాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన సీనియర్ ఫెడరేషన్లో 6వ స్థానానికి పరిమితమైన ఈ క్రీడాకారుడు.. ఇప్పుడు వరంగల్ వేదికగా జరుగుతున్న పోటీల్లో సత్తాచాటి స్వర్ణం గెలుచుకున్నాడు.
సత్తా చాటిన ‘సోనా’ల్..
రేస్వాకింగ్లో మహిళా విభాగం నుంచి రాజస్థాన్ అథ్లెట్ సోనాల్ సుక్వాల్ సత్తాచాటింది. గంటా 42నిమిషాల 41 సెకన్లలో లక్ష్యం చేరి బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆమె తర్వాతి స్థానంలో 1.44.00 టైమింగ్తో రవీనా(రైల్వేస్) రజతం, మూడో స్థానంలో ఉత్తరాఖండ్ క్రీడాకారిణి పాయల్(1.48.00 టైమింగ్) కాంస్యం గెలుచుకుంది. ఈ సందర్భంగా రేస్వాక్ ప్రతిభచూపిన వి జేతలకు డైరెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు. నిట్లో అథ్లెటిక్స్ ఈవెంట్లు జరుగడం గర్వంగా ఉందన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు, సెక్రెటరీ సారంగపాణి, నిట్ పీడీ ప్రొఫెసర్ రవికుమార్, ప్రొఫెసర్ రాజవెళ్లు, ఇండియన్ టెక్నికల్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జి ఏసీపీ నాగయ్య ఉన్నారు.
నా కోచ్.. మా నాన్నే
మాది రాజస్థాన్లోని జైపూర్. నేను బీపీఈడీ చదువుతున్నా. నాన్న రాంపుల్శర్మ ఢిల్లీ రైల్వేలో టీటీ. ఆలిండియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో పది సార్లు మెడల్స్ సాధించా రు. నేను ఆయన్ను ఆదర్శంగా తీసుకు న్నా. నాకు మా నాన్నే కోచ్. అదే ఉత్సాహంతో ఆడి ఇప్పుడు వరంగల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాను.
స్వర్ణం గెలువడం సంతోషంగా ఉంది..
కాజీపేట : యువత క్రీడలపై ఆసక్తి చూపాలి. క్రీడలలో మంచి ఉద్యోగాలు వస్తాయి. తల్లిదండ్రులతో పాటు మన రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తెవచ్చు. వరంగల్లో జరుగుతున్న 60వ నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం రావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు గంటల చొప్పున ప్రాక్టీస్ చేస్తా. దేశానికి పేరు తీసుకురావడమే నా కల.
దేశ ప్రతిష్టను పెంచుతా..
కాజీపేట : రాంచీలో 2020-21లో జరిగిన 20 కేఎం రేస్వాక్లో కేవలం 136.05 సెకన్లలో గమ్యం చేరినా థర్డ్ ప్లేస్ వచ్చింది. ఎంతో నిరాశ పడ్డాను. ఎలాగైనా ఫస్ట్ రావాలనుకున్నా. కానీ లాక్డౌన్తో ప్రాక్టీస్ తక్కువైంది. పోటీలో పాల్గొనడం కష్టమైంది. అయినా ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్లోకి దిగాను. ఇప్పుడు 142.14 సెకన్లలో లక్ష్యం చేరి స్వర్ణం గెలుచుకున్నా. ఒలింపిక్స్లో పాల్గొని భారత దేశ పేరు ప్రతిష్టను పెంచడమే నా లక్ష్యం.