వరంగల్, సెప్టెంబర్ 16: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సమష్టి కృషితో వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని కమిషనర్ ప్రావీణ్య అన్నారు. గురువారం సాయంత్రం ఆమె కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో ఇంటింటా సర్వే చేసి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి మరుసటి రోజు టీకాలు వేయించాలన్నారు. ప్రతి డివిజన్కు నోడల్ అధికారితోపాటు ఐదు డివిజన్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. ప్రతి నోడల్ అధికారితో 15 మంది సర్వే సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి డివిజన్లో రోజుకు 200 మందికి కచ్చితంగా టీకాలు వేయించాలన్నారు. సర్వే అనంతరం స్టిక్కర్ అంటించి వ్యాక్సినేషన్ వివరాలు రాయాలన్నారు.
ప్రతి రోజు సాయంత్రం 4 గంటల వరకు రోజువారీ నివేదిక అందించాలన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లు 18004251980, 9701999645, 7997100300 నంబర్లలో సంప్రదించి సమాచారం పొందాలన్నారు. స్మార్ట్ఫోన్ ఉండి డేటా నమోదులో అనుభవం, ఆసక్తి ఉంటే 9515108991, 9515108986 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేయాలని, రోజుకు రూ. 400 గౌరవ వేతనంతోపాటు భోజన వసతి కల్పిస్తామన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్యాదవ్, పన్నుల అధికారి శాంతికుమార్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ను వినియోగించుకోవాలి
పోచమ్మమైదాన్/కాశీబుగ్గ: ప్రత్యేక స్పెషల్ డ్రైవ్లో ప్రజలు కరోనా వ్యాక్సిన్ను వినియోగించుకోవాలని 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి, దేశాయిపేట యూపీహెచ్సీ డాక్టర్ తంగళ్లపల్లి భరత్కుమార్ కోరారు. పోచమ్మమైదాన్ కమ్యూనిటీ హాల్లో ఆయన వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఎల్బీనగర్లోని షాదీఖానలో టీకాలు వేశారు. కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్, హెల్త్ సూపర్వైజర్ జన్ను కోర్నెలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాశీబుగ్గ 19వ డివిజన్లో వ్యాక్సిన్ సెంటర్ను మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ప్రారంభించారు. బ్రహ్మంగారి వీధిలో టీకాలు వేశారు.