నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 15: కార్యదర్శులు గ్రామ పంచాయతీల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని భాంజీపేట, చంద్రయ్యపల్లిలో పల్లెప్రగతి పనుల పురోభివృద్ధిని డీఎల్పీవో పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలు, డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల పనులను పరిశీలించారు. వీధుల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో గమనించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. జీపీ కార్యాలయాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. రికార్డుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పల్లెప్రగతి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వేగం పెంచాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ నిరంతరం పక్కాగా జరుగాలన్నారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీడీ సాయిచరణ్, ఏపీవో ఫాతిమామేరీ, సర్పంచ్లు పలకల పూలమ్మ, బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శులు స్నేహలత, మధు, కారోబార్ ఆనంద్ పాల్గొన్నారు.