ఖిలావరంగల్, సెప్టెంబర్ 14: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ప్రజలకు సేవలు అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. మంగళవారం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. వివిధ కేసుల్లో భాగంగా స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలను యజమాని తీసుకెళ్లేలా నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, స్టేషన్లోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెసుకున్నారు. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరును కూడా పరిశీలించారు. ఇదిలాఉండగా నంబర్ ప్లేట్లు లేని పోలీసుల వాహనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టపరిధిలో అందరూ సమానమేనన్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా, హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధిస్తుంటే.. పోలీస్ సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించడం ఏమిటని ప్రశ్నించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలతోపాటు హెల్మెట్ ధరించని పోలీసులను మందలిస్తూ ట్రాఫిక్ జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజలకు నిబంధనలు తెలియజేసే పోలీసులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, వరంగల్ ఏసీపీ కే గిరికుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై కుమారస్వామి ఉన్నారు.