సంగెం, సెప్టెంబర్ 4 : పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని కాపులకనపర్తి, ఆశాలపల్లి గ్రామాల్లోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్నిపరిశీలించి, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు పెంచే విధంగా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు.
నెక్కొండ: పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. శనివారం మండల పరిధి నెక్కొండ, అప్పల్రావుపేట గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత, ఆదర్శ పాఠశాల, నెక్కొండలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈవో రత్నమాలతో కలిసి తనిఖీ చేశారు. శానిటేషన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమున, పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు. అలాగే, నెక్కొండలో పంటల నమోదును జేడీఏ పరిశీలించారు.
చెన్నారావుపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని మండల స్పెషలాఫీసర్ బాలకృష్ణ అన్నారు. ఎంపీడీవో గడ్డల దయాకర్తో కలిసి ఆయన మండలంలోని జల్లి, ఉప్పరపల్లి, ఎల్లాయగూడెం, కోనాపురం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. హెచ్ఎంలు పాఠశాలలోని పారిశుధ్య పనులపై దృష్టి సారించాలన్నారు. గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. పాఠశాలల్లోని ఫర్నీచర్స్, తరగతి గదులను సోడియంహైపో క్లోరైట్తో ధ్రవాణం పిచికారీ చేయించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో దయాకర్, ఉప్పరపల్లి, జల్లి, ఎల్లాయగూడెం, కోనాపురం పాఠశాలల హెచ్ఎంలు ఫ్లోరెన్స్, సరళ, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కృష్ణమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖానాపురం: విద్యార్థులు మాస్కు తప్పకుండా ధరించాలని డీడబ్ల్యూవో, మండల ప్రత్యేకాధికారి శారద అన్నారు. మండలంలోని మంగళవారిపేట ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేసి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీవో కైసర్, సైపర్వైజర్ కళావతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాస ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్కుమార్ అన్నారు. శనివారం కాశీబుగ్గలోని ప్రభుత్వ నరేంద్రనగర్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థులకు పలు జాగ్రత్తలు సూచించారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించారు. అలాగే, వరంగల్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ జనరల్ మేనేజర్ నర్సింహాస్వామి నరేంద్రనగర్ హైస్కూల్ను పరిశీలించారు.
విద్యా సంస్థల్లో పెరుగుతున్న హాజరు శాతం
ఖిలావరంగల్ : వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో విద్యార్థుల హాజరు సంఖ్య క్ర మంగా పెరుగుతోంది. మొదటి రోజు 30శాతం విద్యార్థులు హాజరవగా, 4వ రోజు శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో 42.55 శాతం, ఏయిడెడ్లో 42.73 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 39.01 శాతం హాజరయ్యారు.