వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 25: జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 606 మంది సిబ్బందితో 163 సబ్ సెంటర్లతోపాటు ఇంటింటికీ వెళ్లి అర్హులకు టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. శనివారం జిల్లావ్యాప్తంగా 12,583 మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించారు. ఇందులో 10,073 మందికి మొదటి డోసు, 2,510 మందికి సెకండ్ డోసు టీకాలు వేశామన్నారు. స్పెషల్ డ్రైవ్లో ఇప్పటి వరకు 66,825 మంది మొదటి డోసు, 19,417 మందికి రెండో డోసు వ్యాక్సిన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే వంద శాతానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 15 గ్రామాలు సంపూర్ణంగా వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో బ్యానర్లు సైతం ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సమకూర్చిన వాహనాల వినియోగంతో ముమ్మరంగా సాగుతున్నదన్నారు.
కరోనా మహమ్మారిని తరిమేందుకు..
ఖిలావరంగల్/సంగెం/నర్సంపేటరూరల్/నర్సంపేట: కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో ఖిలావరంగల్లోని అన్ని డివిజన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. పడమరకోట, మధ్యకోట, తూర్పుకోట, గిరిప్రసాద్నగర్, శివనగర్లోని ఆర్యవైశ్య సంఘం భవనం, చింతల్ పీహెచ్సీ, ఖిలావరంగల్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్లో వేంగం పెంచారు. వందశాతం పూర్తి చేసుకున్న కాలనీ పెద్దలను అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. శనివారం ఖిలావరంగల్లో కార్పొరేటర్లు బోగి సువర్ణ, బైరబోయిన ఉమ, శివనగర్లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణమూర్తి వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. సంగెం మండలంలో శనివారం వెయ్యి మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి పొగాకుల అశోక్ తెలిపారు. తొమ్మిది సబ్సెంటర్లలో టీకాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. నర్సంపేట మండలం గుంటూరుపల్లి జీపీ కార్యాలయంలో సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ, చెన్నారావుపేట మెడికల్ ఆఫీసర్ ఉషారాణి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కమ్మపల్లి, దాసరిపల్లి, చక్రంతండాలో జడ్పీటీసీ కోమాండ్ల జయ ఆధ్వర్యంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డుకు కరోనా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.